రేపు ఇళయరాజా మ్యూజిక్ కాన్సర్ట్‌

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ముచ్చింతల్లోని Statue of Equality వేదికగా ‘సమతా ఇళయరాగం’ LIVE IN CONCERT .. శనివారం సాయంత్రం ఆరుగంటలకు జరుగుతుంది. ఒక్కసారైనా ఇళయరాజాను చూడాలని..ఆయన సంగీతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించాలని ఆశపడే అభిమానుల కోరిక తీరబోతోంది. రండి..ఈ వేసవిలో చల్లని స్వరాల జల్లులతో స్నానమాడుదాం! Book My Showలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.

అనేక గ్రీష్మాల మధ్య ఒక వర్షం..ఇళయరాజా పాట!… కాలానికి లొంగని..ట్రెండుకు అందని.. నిత్యనూతనం ఆయన ఆలాపన!. సన్నాయి స్వరాలకు ట్రంపెట్‌ విన్యాసాలు జతచేసి.. సితార్‌ సిత్రాలను బేస్‌ గిటార్‌తో గీటి.. ఇళయరాజా స్వరపరచిన పాటలు అద్భుతం..అనితరసాధ్యం!. ఇళయరాజా కాన్సర్ట్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఆయన్ను ఒక్కసారైనా చూడాలని..ఇసైజ్ఞాని నేతృత్వంలో ఆర్కెస్ట్రా లయ విన్యాసాలను ఆస్వాదించాలని తహతహలాడుతుంటారు. మన జీవితాల్లోని ప్రతి భావోద్వేగాన్నీ తన పాటల్లో నింపిన ఇళయరాజాకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆరాటపడుతుంటారు.

ఇప్పుడా భాగ్యం..భాగ్యనగర వాసులకు దక్కింది. ముచ్చింతల్లోని స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ వేదికగా.. ‘సమతా ఇళయరాగం’ live in Concert శనివారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. వేయి వసంతాల రామానుజులపై ఇళయరాజా కీర్తనలతోబాటు..108 దివ్యదేశమూర్తులపై ఇసై జ్ఞాని ఆలాపనలతో ఆనంద పరవశులయ్యే తరుణం వచ్చింది. అంతేకాదు, గాయనీ గాయకులు ఇళయరాజా హిట్‌సాంగ్స్‌ పాడుతూవుంటే..మన హృదయ లయలు కోరస్‌ కలిపే శుభసమయం రానే వచ్చింది.

Leave A Reply

Your email address will not be published.