విశాఖకు రాజధాని తరలింపు పై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నానికి రాజధాని తరలింపు పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోస్టర్ ప్రకారం బెంచ్‌ ముందుకు పిటిషన్‌ వచ్చిందని, విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో దీనిపై మధ్యంతర పిటిషన్ వేసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. రాజధాని వ్యవహారాలను విచారించే త్రిసభ్య ధర్మాసనం లేదా పాలనాపరంగా ఏం చేయాలనే అంశంపై ప్రభుత్వమే ఆలోచించుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. ఒకవేళ ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే తానే విచారిస్తానని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడంతో ప్రభుత్వ న్యాయవాది ఒకే చెప్పారు.

ఈలోపు కార్యాలయాలు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందువల్ల మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ హైకోర్టుని కోరారు. కార్యాలయాల తరలింపుపై ఇప్పటికిప్పుడు ఏమీ జరగదని, అది సుదీర్ఘ ప్రక్రియ అని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకి తెలిపారు. ప్రభుత్వం ఇలానే చెప్పి, మళ్లీ తిరిగి కార్యాలయాలను తరలించేందుకు అంతర్గత ఏర్పాట్లు చేస్తోం దని పిటీషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి రాజధానిని తరలించకుండా ఆదేశాలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశించింది. దీంతో కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.