పంట బీమాపై తెలంగాణలో కీలక అప్ డేట్
తెలంగాణ లోకి వెబ్ న్యూస్: రాష్ట్రంలో కొత్త పంటల బీమా పథకం (క్రాప్ ఇన్సూరెన్స్) పథకం అమలుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ‘పీఎం- ఎఫ్బీవై’ పథకంలో చేరటంతో పాటు రైతుల వాటా ప్రీమియాన్ని భరించాలని డిసైడ్ అయింది. తెలంగాణ సబ్సిడీతోపాటు రైతుల తరఫున ప్రీమియం సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు విధివిధానాల రూపకల్పనకు సిద్ధమయ్యారు.పథకం అమలు దిశగా బీమా కంపెనీలతో ఒప్పందాలు, ప్రీమియం నిర్ధారణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టే క్రాప్ బుకింగ్ యాప్లో నమోదైతే చాలు ఆ పంటలకు బీమా వర్తించనుంది. సుమారు 1.35 కోట్ల ఎకరాల నుంచి 1.45 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో వానకాలం పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారుల అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం విస్తీర్ణానికి పంటల బీమా పథకం అమలు చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం మెరుగ్గా అమలు చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా అధికారులు సదస్సులు నిర్వహిచేందుకు సిద్ధమయ్యారు. ఏఈవోల స్థాయి నుంచి ఏవోఏలు, ఏడీఏలు, డీఏవోలు, సీపీవోలు, ఇతర అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ సదస్సులు కొనసాగనున్నాయి.