తెలంగాణలో గవర్నర్కు సంబంధించి సీఎం ప్రోటోకాల్ పాటించట్లేదు
- ఇది అహంకారం కాక మరేంటి ? : గవర్నర్ తమిళిసై
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత రాష్ట్ర సమితి ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభ లో గవర్నర్ వ్యవస్థపై సీఎంలు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో గవర్నర్కు సంబంధించి సీఎం ప్రోటోకాల్ పాటించట్లేదని ఆమె చెప్పారు. రాజ్యాంగ పదవిలో ఉండి రాజకీయాలు మాట్లాడబోనన్నారు. మిగతా రాష్ట్రాల గురించి తాను మాట్లాడబోనని కానీ తెలంగాణ సర్కార్ ఎందుకు ప్రోటోకాల్ పాటించట్లేదో చెప్పాలన్నారు. గవర్నర్ అంటే కేసీఆర్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపు అని తమిళిసై ప్రశ్నించారు. ఇది అహంకారం కాక మరేంటని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రోటోకాల్ ఎందుకు పాటించట్లేదో సమాధానమివ్వాలన్నారు. అప్పుడు మాత్రమే రాజ్యాంగ వ్యవస్థపై మాట్లాడాలన్నారు. తాను పాతికేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రొటోకాల్ తనకు తెలుసన్నారు. గవర్నర్ వ్యవస్థను ఎలా హేళన చేస్తారని తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గవర్నర్ను అవమానించారని ఆమె ఆరోపించారు.నిన్న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎంలు ప్రసంగిస్తూ రాష్ట్రాల గవర్నర్లు అమాయకులని, ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతున్నది ప్రధాని మోదీయేనని ఆరోపించారు. గవర్నర్లకు మంచి జీతం, విలాసవంతమైన భవనాలు, ఐదేళ్లు సుఖంగా ఉండేలా పోస్టు ఇస్తారని, ఆపై సీఎంలను ఇబ్బంది పెట్టాలని ఢిల్లీ నుంచి ఫోన్లు చేస్తుంటారని ఆరోపించారు. ఇలా ఇబ్బంది పెడుతూ పోతే దేశం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు. తమిళనాడు గవర్నర్ సీఎం స్టాలిన్ను, తెలంగాణ గవర్నర్.. కేసీఆర్ను, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వాన్ని, పంజాబ్ గవర్నర్.. మాన్ను ఇబ్బందిపెడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల వంటి అంశాలు ప్రధానికి పట్టవని, ఏ ప్రభుత్వాన్ని కూల్చాలి, ఎమ్మెల్యేలను ఎలా కొనాలి లాంటి ఆలోచనలే చేస్తుంటారని విమర్శించారు. వరుసగా రెండు సార్లు అవకాశమిచ్చినా బీజేపీ వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, ప్రజల ఆరోగ్యం, విద్య గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని 2024లో ఏర్పాటు చేసుకోవాలని కోరారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా రాజకీయాల వల్లే అభివృద్ధిలో వెనకబడ్డామని అన్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం విజయన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, సీపీఐ నేత డి.రాజా తదితరులు హాజరయ్యారు.తెలంగాణలో రాజ్భవన్, ప్రగతిభవన్ మధ్య సంబంధాలు ఇటీవల దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం, గవర్నర్ వ్యవస్థలు రెండూ ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రభుత్వం.. గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించింది. దీంతో ఇందుకు ప్రతీకారం అన్నట్లుగా.. బడ్జెట్కు ఆమోదం తెలపకుండా నిలువరించే అధికారం ఉన్నా… ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆమోదం తెలిపానని అప్పట్లో గవర్నర్ తీవ్రంగా స్పందించారు. అయితే గత శాసనసభ సమావేశాలకు కొనసాగింపుగానే సభను నిర్వహిస్తున్నామని, గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలను నిర్వహించుకోవచ్చంటూ ప్రభుత్వ వర్గాలు లీకులిచ్చాయి. గవర్నర్ కూడా వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం పంపించిన ప్రసంగ పాఠాన్ని కాకుండా తన సొంత ప్రసంగ పాఠాన్ని చదివారు. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం మరింత ముదిరింది. రాజ్భవన్కు, ప్రగతిభవన్కు మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. నిజానికి ఎమ్మెల్సీగా పాడి కౌశిక్రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిపాదిస్తే… గవర్నర్ తిరస్కరించినప్పటి నుంచే ఇరు వ్యవస్థల మధ్య దూరం మొదలైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒకరిపై ఒకరు పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. గవర్నర్ వ్యవస్థను ఏమాత్రం కేర్ చేయనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తోంది.