శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్; రెండు దశాబ్దాల నిర్మల్‌వాసుల కల సాకారమైంది. దిలావర్‌పూర్‌ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్‌ -27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకం)ను స్థానిక మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఎత్తిపోతల పథకానికి స్విచ్‌ ఆన్‌ చేసి కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు అంకితం ఇచ్చారు.శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి ఎత్తిపోతల పథకాన్ని రూ.714 కోట్లతో నిర్మించారు. ఈ పథకం ద్వారా నిర్మల్‌ నియోజకవర్గంలోని దిలావర్‌పూర్‌, నర్సాపూర్‌ (జి), కుంటాల, సారంగాపూర్‌, నిర్మల్‌, లక్ష్మణచాంద, మామడ, సోన్‌ మండలాల్లోని 99 గ్రామాల పరిధిలో గల చెరువులు, కుంటలకు నీరందించే అవకాశం కలిగింది. 20 ఏండ్లుగా ఒకే పంటకు పరిమితమైన భూముల్లో ఇక మూడు పంటలు రానుండగా, అన్నదాతల సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి, నిర్మల్‌ నియోజకవర్గ రైతులకు సాగు నీరందేలా చేసిన సీఎం కేసీఆర్‌కు రైతన్నలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ప్రాజెక్టు స్వరూపం

ప్యాకేజీ 27 పనులను మూడు యూనిట్లుగా విభజించి పనులను పూర్తి చేశారు. మొదటి యూనిట్‌ కింద 32 వేల ఆయకట్టును నిర్ధేశించారు. ఇందులో భాగంగా దిలావర్‌పూర్‌ గ్రామ శివారులో సిస్టర్న్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దీని ద్వారా లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌, రైట్‌ మెయిన్‌ కెనాల్‌లోకి సాగు నీటిని ఎత్తి పోయనున్నారు. యూనిట్‌-1 కింద ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌లో గుండంపెల్లి వద్ద ఇప్పటికే పంప్‌హౌస్‌ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ 6.70 కిలోమీటర్ల పొడువుతో అప్రోచ్‌ చానల్‌ను నిర్మించారు. లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ పొడువు 29.50 కిలో మీటర్లు కాగా, ఈ కాలువ ద్వారా నీటి సరఫరా సామర్థ్యం 140 క్యూసెక్కులు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే రైట్‌ మెయిన్‌ కెనాల్‌ పొడువు 13.50 కిలోమీటర్లు కాగా, నీటి సరఫరా సామర్థ్యం 100 క్యూసెక్కులుగా ఉంది.ఇదిలా ఉంటే రెండో యూనిట్‌ కింద 5 వేల ఎకరాల ఆయకట్టును నిర్ధేశించారు. దీనికోసం దిలావర్‌పూర్‌ గ్రామ శివారులో మొదటి పంప్‌హౌస్‌ డెలివరీ సిస్టర్న్‌ వద్ద రెండో పంప్‌హౌస్‌ను నిర్మించారు. ఇక్కడి నుంచి పంపింగ్‌ ద్వారా నీటిని ఎత్తి పోయనున్నారు. దీని పరిధిలో లెఫ్ట్‌ కెనాల్‌ పొడువు 7.50 కిలోమీటర్లు కాగా, రైట్‌ కెనాల్‌ పొడువు 3.75కిలోమీటర్లుగా ఉంది. ఆయా కెనాల్స్‌ నీటి సరఫరా సామర్థ్యం 20 క్యూసెక్కులుగా ఉంది. అలాగే.. 3వ యూనిట్‌ కింద 13 వేల ఆయకట్టును నిర్ధేశించారు. సోన్‌ మండలంలోని కడ్తాల్‌ గ్రామం వద్ద మూడో పంప్‌హౌస్‌ నిర్మాణంలో ఉంది. ఈ పంప్‌హౌజ్‌లోని రెండు పం పుల ద్వారా సరస్వతీ కెనాల్‌లో నుంచి నీటిని ఎత్తి పోయాలని ప్రతిపాదించారు. దీనికింద 17.50 కిలోమీటర్ల మేర లెఫ్ట్‌ కెనాల్‌, 1.90 కిలోమీటర్ల మేర రైట్‌ కెనాల్‌ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి

Leave A Reply

Your email address will not be published.