బడ్జెట్ 2023లో భారతీయ రైల్వేస్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బడ్జెట్ 2023లో భారతీయ రైల్వేస్‌కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊతమివ్వనుందా?.. అంటే ఔననే విశ్లేషణలే వినిపిస్తున్నాయి. బడ్జెట్ 2023-24లో రైల్వేస్‌కు భారీగా సుమారు రూ.1.9 లక్షల కోట్లు (23 బిలియన్ డాలర్లు) కేటాయించే అవకాశాలున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. వందేభారత్‌కు ఊతమివ్వడంలో భాగంగా 500 లకుపైగా సెమీ-హైస్పీడ్ రైళ్లు, 35 హైడ్రోజన్-ఫ్యుయెల్డ్ రైళ్లను ప్రతిపాదించనున్నట్టు పేర్కొన్నాయి.

         వందే భారత్ రైళ్లు ఎందుకంటే..

బడ్జెట్‌లో వందేభారత్ రైళ్లకు ఊతమివ్వడానికి రెండు కారణాలున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రాజధాని, శతాబ్ధి రైళ్లన్నింటినీ వందేభారత్ రైళ్లతో రిప్లేస్ చేసి రూట్లలో సగటు వేగాన్ని గంటకు 180 కిలోమీటర్లకు పెంచాలనేది మొదటి కారణంగా ఉంది. ఇక 2025-26 నాటికి యూరప్, సౌత్ అమెరికా, ఈస్ట్ ఏసియా దేశాలకు వందేభారత్ రైళ్లను ఎగుమతి చేయాలనేది రెండవ కారణమని పేర్కొన్నాయి. మరోవైపు బడ్జెట్2023లో 4000 నూతన డిజైన్డ్ ఆటోమొబైల్ క్యారియర్ కోచ్‌లు, 58,000 వేగన్స్‌ను బడ్జెట్‌లో ప్రతిపాదించనున్నారని సమాచారం. రానున్న 3 ఏళ్లలో వీటిని ఆచరణలోకి తీసుకురానున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

హైడ్రోజన్ సామర్థ్యమున్న రైళ్లు..

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటివల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 8 వారసత్వ రూట్లలో హైడ్రోజన్ సామర్థ్యమున్న రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి బడ్జెట్2023లో ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారసత్వ రూట్ల జాబితాలో డార్జిలింగ్, నీలగిరి, కల్కా-షిమ్లా, కంగ్రా వ్యాలీ కూడా ఉన్నాయి. ఈ నూతన నమూనా రూట్లను ఉత్తర రైల్వే వర్క్‌షాప్‌లో రూపొందిస్తున్నారు. హర్యానాలోని సోనిపట్-జింద్ సెక్షన్‌పై పరిశీలించనున్నారు. ఈ నమూనా అందుబాటులోకి వస్తే పర్వత ప్రాంతాల్లో జీరో కార్బన్ ఉద్గారాలతో రైళ్లను నడిపించే అవకాశం దక్కుతుంది. రైళ్లు, కోచ్‌లు, వేగన్స్ ప్రతిపాదనలకు సంబంధించి ఈ బడ్జెట్‌ అత్యధికమవ్వొచ్చనే అంచనాలున్నాయి. ప్రణాళికలను ఆధునీకరించే అవకాశాలున్నాయనే విశ్లేషణలున్నాయి.

Leave A Reply

Your email address will not be published.