ఇంటర్మీడియట్ కళాశాలలో మౌలిక సదుపాయాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కళాశాలల్లో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ. 60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం ఇంటర్మీడియట్ విద్య పై సమీక్ష నిర్వహించారు.విద్యా సంవత్సరం ఆరంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పూర్తి కాకపోవడంతో ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షించాలని ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాలకోసం, ల్యాబ్ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ. 4 .43 కోట్లు మంజూరు చేశామని, వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయడానికి కేవలం ఆర్టీసీ పైనే ఆధారపడకుండా ప్రైవేట్ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం నాటికి చేరేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశంలోనే ప్రప్రథమంగా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందిస్తున్న మన రాష్ట్రంలో ప్రవేశాల సంఖ్య తగ్గిందనే విషయంలో ఆరోపణలు వస్తున్నాయని, ఇది నిజం కాదని పేర్కొన్నారు. 119 జ్యోతిరావు పూలే పాఠశాలలను, 38 కెజిబివిలను, 2 గిరిజన గురుకులాలను ఇంటర్మీడియేట్ వరకు అప్ గ్రేడ్ చేశామన్నారు.వీటిలో కొంత మంది విద్యార్థులు చేరారని మంత్రి పేర్కొన్నారు. ప్రవేశాల తుది గడువు ఇంకా పూర్తి కాలేదని, గడువు ముగిసే నాటికి గత సంవత్సరంతో పోలిస్తే అధిక ప్రవేశాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం తగ్గడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.మారుమూల జిల్లాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తుండగా అన్ని వనరులు ఉండి కూడా ఈ మూడు జిల్లాలు వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, వివిధ జిల్లాల ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.