కాలంతో పోటీపడుతున్న ఇస్రో
తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: చంద్రయాన్ మిషన్ విజయవంతంగా కొనసాగుతున్నది. మిషన్లో మూడు భాగాలున్నాయని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అహ్మదాబాద్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ పేర్కొన్నారు. ఇందులో ఒకటి ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ చేయడం.. చంద్రుడి ఉపరితలంపై రోవర్ ప్రజ్ఞాన్, మిషన్లోని ఏడు పరికరాలతో సరైన ఆపరేషన్ ఉన్నాయన్నారు. ప్రస్తుతం మూడో ఆపరేషన్లో భాగంగా ఏడు పరికరాలతో డేటా సేకరించి విశ్లేషిస్తున్నారన్నారు. రోవర్ను వీలైనంత వరకు చంద్రుడి ఉపరితలంపై తిప్పాలని, తద్వారా గరిష్ఠ ప్రయోగం చేయడం ద్వారా విలువైన డేటాను సేకరించవచ్చన్నారు. మిషన్ చివరి పది రోజుల్లో మరింత పూర్తి చేయడానికి శాస్త్రవేత్తలు సైతం సమయంతో పోటీపడుతున్నారని నీలేశ్ దేశాయ్ పేర్కొన్నారు.మరో పది రోజుల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంలో చీకటి ఆవరించనున్నది. అయితే, ఈ సమయంలో ల్యాండర్, రోవర్లో అనేక సాధనాలు స్లీప్ మోడల్లోకి వెళ్తాయని, ఉష్ణోగ్రతలు మైనస్ 180 నుంచి 250 డిగ్రీలకు పడిపోతుందన్నారు. అయితే, చీకటి తొలగిన తర్వాత సుదీర్ఘ రాత్రి తర్వాత మళ్లీ పని చేసేందుకు అవకాశాలున్నాయని, ఇదే జరిగితే దక్షిణ ధ్రువంపై మరింత పరిశోధనలు చేపట్టవచ్చన్నారు. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఉష్ణోగ్రతలను తొలిసారిగా చాస్ట్ పరికరంతో కొలిసిన విషయం విధితమే.అయితే, ILSA పరికరం సహాయంతో చంద్రుడిపై కంపాలను రికార్డ్ చేస్తున్నారు. భూమిపై మాదిరిగానే చంద్రుడిపై భూకంపాలు సంభవిస్తాయి. చంద్రయాన్-3 నుంచి వచ్చే సమాచారం ఇలాంటి అనేక రహస్యాలను ఛేదించడంలో సహాయపడనున్నది. గోల్డ్స్టోన్ డీప్ స్పేస్ కాంటాక్ట్ స్టేషన్ ఆఫ్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) సేవలు అందుబాటులోకి రాలేదు. రోవర్ కదలిక సమయంలో ప్రారంభంలో దృశ్యమానత సమస్యలుండగా.. రోవర్ ప్రతిరోజూ 30మీటర్లు దూసుకెళ్లాల్సి ఉండగా.. కేవలం 12 మీటర్లు మాత్రమే ముందుకు కదులుతున్నదని ఆయన వివరించారు.