దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు, ఊహాగానాల సాగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రకటనతో వీటికి చెక్ పెట్టినట్లయ్యింది. జమిలి ఎన్నికలపై రాజ్యసభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్సభ, రాష్ట్రాల విధానసభ ఎన్నికలు నిర్వహణ అంత తేలిక కాదన్నారు.ఒకేసారి ఎన్నికలు జరుపడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని, అయితే ఇందుకు అనేక కీలక అవరోధాలు, అడ్డంకులు సైతం ఉన్నాయన్నారు. రాజ్యాంగ సవరణ అవసరమని.. కనీసం ఐదు కీలక రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందన్నారు. ఎన్నికలు పెద్ద ఎత్తున ఈవీఎంలు, వీవీపాట్స్ మిషన్స్ అవసరమని, అందుకు రూ.వేలకోట్లు ఖర్చవుతాయన్నారు. ఈవీఎంలు, వీవీపాట్స్ 15 సంవత్సరాలకంటే ఎక్కువ పని చేయవని, ప్రతి 15 ఏళ్లకు ఒకసారి అంత పెద్దఎత్తున డబ్చు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు.అదే సమయంలో ఒకేసారి జరిగే ఎన్నికలకు భారీగా పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరమవుతాయన్నారు. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే కేంద్ర సిబ్బంది, న్యాయ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన చేసిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సహా సంబంధిత భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిందని, తదుపరి విధాన రూపకల్పన జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభ్యులకు ఇచ్చిన లిఖిత్వపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.