గుర్తింపు రద్దు చేస్తామంటూ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేయడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగుల గోడు ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా పట్టించుకోకపోతే ఎవరికి మొరపెట్టాలని ప్రశ్నించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు గవర్నర్కు విన్నవించటం నేరమా అని నిలదీశారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ అంశాలేవి ప్రస్తావించలేదు కదా అని అన్నారు. ఉద్యోగసంఘం నేత కె ఆర్ సూర్యనారాయణపై రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణి సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు, నిరంకుశ విధానాలు ఇకనైనా విడనాడాలని హితవుపలికారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం చిత్తశుద్ధి చూపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.