బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే  పైళ్ల శేఖర్‌ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

- కావాలనే బీఆర్‌ఎస్ నేతలపై ఐటీ దాడులు :పైళ్ల శేఖర్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్‌ఎస్ నేతలపై కావాలనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సోదాలు చేపట్టిన ఐటీ అధికారులకు అన్ని రకాలుగా సహకరించామన్నారు. వాళ్ళు వచ్చిన గంటన్నరలోపే పూర్తి వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. అయినా మూడురోజులు ఏదో సాధించాలని కాలయాపన చేశారని విమర్శించారు. నోటీసులు ఇచ్చి వెళ్లారని… మళ్ళీ అవసరమైతే రావాలని చెప్పారని అన్నారు. రియల్ ఎస్టేట్, డెవలపింగ్ తప్ప ఏ వ్యాపారాలు తనకు లేవన్నారు. బ్యాంక్ లాకర్లు తెరిచారన్నారు. తనపై మీడియాలో వచ్చేవి అబద్ధాలని… తాను కొన్న ఆస్తులపై వివరాలు తీసుకున్నారని తెలిపారు. ఏదో ఊహించుకుని ఐటీ అధికారులు వచ్చారు… కానీ ఏమీ దొరకలేదన్నారు. ఐటీ అధికారులకు తమ సీఏ పూర్తి వివరాలు ఇచ్చారన్నారు. మంగళవారం రోజు రమ్మని నోటీసుల్లో తెలిపారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

కాగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. గత మూడు రోజులుగా ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డికి సంబంధించిన కంపెనీలు వాటికి సంబంధించిన ఆడిటర్లు వారి ఆర్థిక లావాదేవీలపై ఐటీ దృష్టి పెట్టింది. సోదాల్లో కీలక మైనా సమాచారాన్ని అధికారులు సేకరించారు. ఎమ్మెల్యేకు కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, వారు చెల్లిస్తోన్న పన్నులుకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. పైళ్ల శేఖర్‌ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్‌ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ శాఖ పరిశీలించినట్లు తెలుస్తోంది. తీర్థా గ్రూప్‌కు డైరెక్టర్‌గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి హైదరాబాద్‌, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.