తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలో అమలవుతున్న EWS రిజర్వేషన్లపై పునఃపరిశీలన చేయాలని, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై చర్చ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. EWS రిజర్వేషన్ చట్టం సవరణకు సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు అంగీకారం తెలిపారని, మరో ఇద్దరు దీనిపై ప్రశ్నలు లేవనెత్తారని, అప్పటి నుంచి ఈ రిజర్వేషన్లపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్చార్జి జైరామ్ రమేశ్ చెప్పారు.అదేవిధంగా కులపరమైన జనగణనకు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, కులపరంగా జనగణన కచ్చితంగా జరిగి తీరాల్సిందేనని జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మూడు ప్రధాన అంశాలను లేవనెత్తనుందని ఆయన చెప్పారు. భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, అధిక ధరలు, దేశంలోని రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర సంస్థల కార్యకలాపాల్లో జోక్యం అనేవి తాము పార్లమెంటులో లేవనెత్తబోయే ప్రధాన అంశాలని జైరామ్ తెలిపారు.