రాష్ట్రంలో జగనన్న విద్యుత్ కోతల పథకం అమలువుతోంది
- విద్యుత్ కోతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో విద్యుత్ కోతలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జగనన్న విద్యుత్ కోతల పథకం అమలువుతోందని, ఇక పరిశ్రమలకు కూడా కష్టకాలం వచ్చేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న విద్యుత్ కోతల పథకం అమలు… ఇక పరిశ్రమలకు కూడా కష్టకాలం వచ్చేసింది… ద్యుత్ సరఫరాలో బారి కోతలు విధిస్తూ పరిశ్రమలకు వినియోగ గడువు నిర్ణయించడంతో పాటు వారానికో రోజు పవర్ హాలిడే ప్రకటించి పరిశ్రమల నడ్డి విరుస్తున్నారు. ఏపీలో పరిశ్రమలపై నాలుగున్నారేళ్లగా పిడుగులు పడుతూనే ఉన్నాయి. పరిశ్రమలు అంటే వైసీపీ ప్రభుత్వానికి డబ్బులు కట్టే సంస్థలుగానే చూస్తున్నారు కానీ… అవి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని… వాటిని కాపాడుకుందామనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు…. కరెంట్ చార్జీలను ఇష్టం వచ్చినట్లుగా పెంచడంతో ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు దాదాపుగా మూతబడ్డాయి. ఇప్పుడు ఇతర పరిశ్రమలకూ కరెంట్ కోతలతో అదే పరిస్థితిని తీసుకొస్తున్నారు. కష్టకాలంలో సహజంగా పరిశ్రమలకు ఏప్రిల్, మే నెలల్లో పవర్ హాలిడే ప్రకటిస్తారు. కానీ సెప్టెంబరు తొలివారంలోనే ఈ విధానాన్ని అమలు చేయడం వైసీపీ ప్రభుత్వ చేతకాని అసమర్థ పాలనకు ఇది ఒక మచ్చుతునక… ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై వేల కోట్ల భారం వేశారు… రైతులకు పంట చేతికి వచ్చే సమయానికి విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు… రైతులకు కనీసం ఇస్తానన్న 9 గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు.
‘‘రాష్ట్ర విభజన తరువాత 22 మిలియన్ యూనిట్లు లోటు ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తన అనుభవంతో సర్ప్లస్ చేసి ప్రతి ఇంటికి 24 గంటలు, పరిశ్రమలకు 24/7 కరెంటు అందించిన ఘనత చంద్రబాబు నాయుడుది. రాష్ట్ర విభజన తరువాత 9529 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం నుంచి 19,080 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. మీరు అధికారంలోకి రాకముందు సర్ప్లస్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ ఇప్పుడు ఎందుకు అస్తవ్యస్తంగా మారిందో.. 2019 నుంచి విద్యుత్తు రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై అర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ఇంధన సంస్థలు తీసుకున్న రుణాలు, ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్ల కోసం చేసిన అప్పుల వివరాలను శ్వేతపత్రాన్ని విడుదల చేసి ప్రజలకు వివరించే ధైర్యం మీకు ఉందా జగన్మోహన్ రెడ్డి గారు..?. మీ అసమర్ధ పాలన వలన ఒక్క విద్యుత్ వ్యవస్థనే కాకుండా రాష్ర్టాన్ని అన్ని విభాగాల్లో భ్రష్టు పట్టించారు, మీరు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. బై జగన్… బై బై జగన్’’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.