కాపలా ఉన్న ఇంటికే కన్నం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..బాన్సువాడ ప‌ట్ట‌ణం  చైతన్య కాలనీలోని మధుకుమార్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే వ్యాపారి బచ్చు భుజేందర్ ఈనెల 1న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి నిజామాబాద్ వెళ్లాడు. 3న ఇంటికి తిరిగి వచ్చారు. అయితే 8న ఇంట్లోని బంగారు ఆభరణాలు కనిపించడం లేదని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బంగారు ఆభరణాల దుకాణాల వద్ద ప్రత్యేక నిఘా పెట్టారు. అయితే  గురువారం గాంధీచౌక్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పట్టుకొని విచారిం చగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడు అదే అపార్ట్ మెంట్ వాచ్ మేన్ రాజు విశ్వనాధ్ ఒగ్లేగా గుర్తించారు.  మహారాష్ట్రలోని ఖందర్ తాలూకా కౌట గ్రామానికి చెందిన విశ్వనాద్ ఒగ్గేకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే పెద్ద కుమార్తె పెళ్లి చేసాడు. ఇంకా నాలుగురు కూతుళ్ల‌ పెళ్లిళ్లు చేయడానికి తాను చేసే జీతం డబ్బులు సరిపోవడం లేదు. దీంతో దొంగతనం చేశానని నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. అతని వద్ద నుంచి మొత్తం 41 తులాల బంగారు ఆభరణాలను, 15 వేల రూపాయ‌ల‌ నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని రిమాండుకు తరలించామ‌న్నారు.

Leave A Reply

Your email address will not be published.