కేసీఆర్…. క్యాన్సర్ కంటే డేంజర్

- క్యాన్సర్ మూడోదశకు చేరితే ఎంత డేంజరో... కేసీఆర్ 3వ సారి సీఎం అయితే అంతకంటే డేంజర్ - నట్టేట ముంచిన బీఆర్ఎస్ కు ఓటేస్తారా? - మీకోసం ఉద్యమాలు చేసి జైళ్లకు పోతున్న బీజేపీకి ఓటేస్తారా? - కేసీఆర్ ను తరిమి తరిమికొట్టి రామరాజ్యం తేవడమే బీజేపీ లక్ష్యం - కేసీఆర్ దంతా పెగ్గుల భాగోతమే.... - ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు... - బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు దండు పాళ్యం ముఠా - వాళ్లను జనం ఓడిస్తారని కేసీఆర్ కు తెలిసిపోయింది - చివర్లో వాళ్లలో సగం మందికి బి.ఫాం ఇవ్వకూడదని సీఎం ఎత్తుగడ వేసిండు - మా గెలుపు మీ గొప్పతనమే -ఎంపీ బండి సంజయ్ కమార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాన్సర్ వ్యాధి కంటే డేంజర్ అని అభివర్ణించారు. ‘‘కేసీఆర్ కేన్సర్ లాంటోడు… మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేసిండు.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు. మూడోసారి వస్తే ఇక అంతే.. క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో… కేసీఆర్ సీఎం అయితే అంతకంటే డేంజర్… ప్రజలారా ఆలోచించండి…’’అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ దంతా పెగ్గుల భాగోతమే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను చూస్తే దండు పాళ్యం ముఠా గుర్తుకొస్తుందన్నారు. అధికారమిస్తే నట్టేట ముంచిన బీఆర్ఎస్ కావాలా? ప్రజల పక్షాన నిత్యం ఉద్యమాలు చేస్తూ జైలుకు వెళ్లేందుకు వెనుకాడని బీజేపీ కావాలా? తేల్చుకోవాలని కోరారు.

చేవెళ్ల (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గ పోలింగ్ బూత్ సమ్మేళంలో పాల్గొనేందుకు చేవెళ్లకు విచ్చేసిన బండి సంజయ్ కు స్థానిక కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. భారీ ఎత్తున హాజరైన కార్యకర్తలకు ఓపెన్ టాప్ జీప్ ఎక్కి అభివాదం చేస్తూ సమావేశానికి విచ్చేశారు. బండి సంజయ్ తోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, జి.వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కర్నాటక ఎమ్మెల్యే చంద్రప్ప, రాష్ట్ర అధికార ప్రతినిధి సీహెచ్.విఠల్, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, రాష్ట్ర నాయకులు అశ్వధ్దామరెడ్డి. కంజర్ల ప్రకాశ్, జంగారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, శ్రీకాంత్ రెడ్డి, నరేందరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వేలాది మంది కార్యకర్తలు హాజరైన ఈ సమ్మేళనంలో వారిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ముఖ్యాంశాలు…

బీఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా దండు పాళ్యం ముఠా… వీళ్లందరినీ ఎలక్షన్ల దాకా తన పక్కనే పెట్టుకుంటడు.. చివర్లో ఇందులో సగం మందికి టిక్కెట్లు ఇయ్యడు… కాంగ్రెస్ లోనే 30 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులు కేసీఆరే పంపిండు…గెలవగానే వాళ్లు బీఆర్ఎస్ లోకి జంప్ అవుతారు. గెలిచినా పార్టీ మారనోళ్లు బీజేపీ వాళ్లు మాత్రమే…

జితేందర్ రెడ్డిది లక్కీ హ్యాండ్. అందుకే ఎస్సీ నియోజకవర్గాల గెలుపు బాధ్యతలు ఆయనకు అప్పగించినం. ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీలే అధికారంలోకి వచ్చాయి. కాబట్టి తొలుత కాషాయ జెండా ఎగరేసే సీటు చేవెళ్లనే.

మా గెలుపు మీ గొప్పతనమే. మీరు చెబితేనే పోలింగ్ బూత్ లలో బీజేపీకి ఓట్లేస్తేనే మేం ఎంపీలుగా, ఎమ్మెల్యేగా గెలిచినం. బీజేపీ అధికారంలోకి

దళితుల పొట్ట కొట్టిన దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రంలో 12 మంది దళితులకు గవర్నర్ పదవులిస్తే… కేసీఆర్ దళితులకు చేసిందేమిటి? ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మాట తప్పాడు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాట తప్పిండు.. దళిత బంధులో ఎమ్మెల్యేలకు 30 శాతం, కేసీఆర్ కుటుంబానికి 30 శాతం వెరసి కారు…సారు…60 శాతం సర్కార్ గా మారింది.

దళితులకు కేంద్రం ఎన్నో నిధులిస్తోంది. పూచికత్తు లేకుండా రూ.5 కోట్లు ఇవ్వాలని, ఏటా 1 లక్షా 20 వేల మందిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న ఘనత మోదీదే.

అంబేద్కర్ రాజ్యాంగాన్ని, విగ్రహాన్ని అవమానించిన ఘనుడు కేసీఆర్. మేం అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి నిలదీస్తే… మీరు ప్రారంభించకుంటే.. బీజేపీ అధికారంలోకి రాగానే విగ్రహం ప్రతిష్టిస్తామని హెచ్చరిస్తే భయపడి పనులు మొదలుపెట్టి ప్రారంభించాడు.

అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ ది. దళితులు, అణగారినవర్గాల సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావిస్తే… ఆనాటి నెహ్రూ అవమానించారు. వెంటనే కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తే ఆయనను కుట్ర చేసి అవమానించిన చరిత్ర కాంగ్రెస్ దే. అంబేద్కర్ ను దేవుడిగా కొలుస్తున్న పార్టీ బీజేపీ. పంచ్ తీర్థాలను ఏర్పాటు చేసి అంబేద్కర్ చరిత్రను ప్రపంచానికి తీసుకెళుతోంది.

కేసీఆర్ దంతా పెగ్గుల భాగోతమే. ఒక పెగ్గు వేస్తే దళితుడే సీఎం అంటడు.. రెండో పెగ్గేసి దళితులకు మూడెకరాలిస్తానంటడు.. మూడో పెగ్గేసి దళిత బంధు ఇస్తానంటడు.. నాలుగో పెగ్గు వేసి హామీలన్నీ అమలు చేస్తానంటడు.. ఐదో పెగ్గేసి అన్నీ తూచ్ అంటడు…

కేసీఆర్ కేన్సర్ లాంటోడు… మొదటిసారి అధికారంలోకి వచ్చి మోసం చేసిండు.. రెండోసారి అధికారంలోకి వచ్చి భూములన్నీ అమ్మేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిండు. మూడోసారి వస్తే ఇక అంతే.. క్యాన్సర్ మూడో దశకు చేరితే ఎంత డేంజరో… కేసీఆర్ సీఎం అయితే అంతకంటే డేంజర్… ప్రజలారా ఆలోచించండి…

బాబాసాహెబ్ అంబేద్కర్ ను, దళిత సమాజాన్ని అడుగడుగునా అవమానిస్తున్న బీఆర్ఎస్ కు ఓటేస్తారా? దళిత అభ్యున్నతే లక్ష్యంగా, అంబేద్కర్ ను దేవుడిగా కొలుస్తున్న బీజేపీకి ఓటేస్తారా?…దళితుల సమాజం ఆలోచించాలి.

ప్రజలను అడుగడుగునా మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని తరిమితరిమి కొట్టి తెలంగాణలో రామరాజ్యం స్థాపించి పేదలను అభివ్రుద్ది చేయడమే బీజేపీ లక్ష్యం.

దేశంలో కిసాన్ సమ్మాన్ నిధి, ఎరువుల సబ్సిడీ పేరుతో ఒక్కో రైతుకు రూ.30 వేల సబ్సిడీ ఇస్తున్న మోదీ ప్రభుత్వం కావాలా? వడ్లు కొనుగోలు చేయాలని ధర్నాలు చేసిన రైతుల తలలు పగలకొట్టిన కేసీఆర్ కావాలా? ఆలోచించండి…

నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన ఉద్యమించిన నాతోపాటు కార్యకర్తలను రెండుసార్లు జైలుకు పంపారు. నా ఆఫీస్ పై పోలీసులతో దాడి చేయించారు. కట్టర్ తో గేటు బద్దలు కొట్టి కార్యకర్తలపై దాడి చేసి జైలుకు పంపారు… అయినా వెనుకాడకుండా పోరాడితే దిగొచ్చిన కేసీఆర్ ఉద్యోగులకు జీతాలిస్తున్నడు. పీఆర్సీ వేస్తానని చెబుతున్నడు.

బీసీలంతా బీజేపీ మా పార్టీ అని భావిస్తున్నరు కాబట్టే… ఎమ్మెల్యే టిక్కెట్లలో కేసీఆర్ బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిండు… బీసీలారా ఆలోచించండి….52 శాతం బీసీలున్న రాష్ట్రంలో 22 సీట్లు మాత్రమే ఇచ్చిన బీఆర్ఎస్ కావాలా? బీసీనే ఏకంగా ప్రధానమంత్రిని చేయడంతోపాటు ఏకంగా 27 మంది బీసీలను కేంద్ర మంత్రులుగా బీజేపీ కావాలా?

ఆర్టీసీ విలీనం పెద్ద కుట్ర. ఆర్టీసీ ఆస్తులను బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి 99 ఏళ్లకు లీజు పేరుతో వేల కోట్ల భూములను దోచుకునే కుట్రకు తెరదీశారు. దీనిని గుర్తించిన తరువాతే గవర్నర్ జోక్యం చేసుకుని ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలనే పట్టుదలతో సిఫారుసులు చేస్తే… గవర్నర్ ను కూడా బదనాం చేసే దుస్థితికి చేరుకున్నారు..

తెలంగాణ ప్రజలారా…. ఎన్నికలకు 3 నెలలే టైముంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసే పోటీ చేయబోతున్నయ్. పైకి మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని దుష్ప్రచారం చేస్తున్నయ్. పార్లమెంట్ లో బయట, లోపల బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసే పనిచేస్తున్నయ్. ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తున్న చరిత్ర ఉంది. ఈ విషయం ప్రజలకు అర్ధమై బీజేపీని ఆదరిస్తుంటే… ఓర్వలేక బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నరు. కాంగ్రెస్ కు డిపాజిట్లే రావడం లేదు. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా గెలిచింది బీజేపీయే..

బీజేపీ మత విద్వేషాలు రగిలిస్తుందని ఎంఐఎం చెప్పడం సిగ్గు చేటు… పాతబస్తీకి రావొద్దని సవాల్ చేస్తే… అక్కడికి వచ్చి కాషాయ జెండా ఎగరేసి పాతబస్తీ మీ అయ్య జాగీరు కాదని నిరూపించిన పార్టీ బీజేపీ. ఛార్మినార్ ప్రాంతాన్ని భాగ్యలక్ష్మీ అమ్మవారు కొలువైన ప్రాంతమని గర్జించిన పార్టీ బీజేపీ. ఇయాళ రేవంత్ రెడ్డి, కేసీఆర్ బిడ్డ కవిత నోట భాగ్యలక్ష్మీ అమ్మవారి పేరును పలికించిన పార్టీ బీజేపీ మాత్రమే.

ఈ ఘనత కార్యకర్తలదే. దయచేసి మీరంతా తప్పుడు మాటలు నమ్మకండి. రాబోయే రోజుల్లో మోసాలు, అనర్ధాలు జరిగే ప్రమాదముంది. ఇప్పటికే కేసీఆర్ 5 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజిన్ సర్కార్ తో తెలంగాణ అభివ్రుద్ది సాధ్యం. కిషన్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం.

కేసీఆర్, ఆయన కుటుంబం ఏం చేసింది. వాళ్లపై కేసులున్నాయా? ఉద్యమకారుల త్యాగాలతో అధికారమెక్కి తెలంగాణ ద్రోహల పార్టీగా మారారు. బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలి? మీకోసం కొట్లాడి జైలుకైనా వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీకి ఓటేస్తారా? మిమ్ముల్ని నట్టేట ముంచుతున్న బీఆర్ఎస్ కు ఓటేస్తారా?… ప్రజలంతా ఆలోచించాలి.

Leave A Reply

Your email address will not be published.