తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ (మంగళవారం) అభద్రతా భావంతో మాట్లాడారని, భవిష్యత్లో అధికారంలోకి రావడం కల అన్నట్లు మాట్లాడారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుమార్తె కవిత ను బీజేపీ లోకి రావాలని అడుగుతున్నారని అనడం అందుకు నిదర్శనమన్నారు. గవర్నర్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెబితే నమ్మలేదని.. కానీ నిన్న సీఎం మాటలతో నిజమని అర్ధమైందన్నారు. పార్టీ మారమని అడిగితే చెప్పుతో కొట్టాలని అంటున్న కేసీఆర్.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎలా విలీనం చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. మరి కేసీఆర్ను దేంతో కొట్టాలన్నారు.ఎమ్మెల్యేలను భయపెట్టడానికే నిన్న సమావేశం పెట్టరా? అని మల్లు రవి ప్రశ్నించారు. ప్రగతి భవన్లోనే భద్రత అంటే.. సామాన్యుల పరిస్థితి ఎంటన్నారు. కరీంనగర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను యువకులు చెప్పులతో కొట్టారన్నారు. రోడ్లు లేవని నిరసన తెలుపుతున్న వాళ్ళపై కేసులు పెట్టారన్నారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే వంద కోట్లు తీసుకుని అమ్ముడు పోయారని ఎవరో పోస్టర్లు వేస్తే పోలీసులు కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని మల్లు రవి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.