కాపు ఓట్లకు కేసీఆర్‌ ఎసరు!

-ఏపీలో వాటిని నిలువునా చీల్చే ఎత్తుగడ?.. -జంట నగరాల్లో కాపు భవన్‌కు ఐదెకరాలు.. -రూ.10 కోట్ల మంజూరు చేస్తాననీ వెల్లడి -జగన్‌పై కాపుల్లో తీవ్ర వ్యతిరేకత -అందుకే ‘చీలిక’ ఎత్తు.. -జనసేన-టీడీపీ వైపు మొగ్గకుండా అడ్డుకోవడమే కేసీఆర్‌ ఉద్దేశం -జగన్‌ తరఫున రిటైర్డ్‌ కాపు అధికారులతో భేటీ.. -మూడున్నర గంటలు మంతనాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్మోహన్‌రెడ్డికి లబ్ధి చేకూర్చేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త వ్యూహానికి తెరలేపారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జగన్‌ వైఖరిపై తీవ్ర అసహనంతో ఉన్న కాపుల ఓట్లు గంపగుత్తగా టీడీపీ-జనసేనకు వెళ్లకుండా.. వాటిని చీల్చేయాలని ఆయన భావిస్తున్నారని చెబుతున్నాయి. అందుకే ఆదివారం హైదరాబాద్‌లో కాపు వర్గానికి చెందిన కొందరు మాజీ అఖిల భారత సర్వీసు అధికారులతో సమావేశమయ్యారు. వీరిలో మాజీ ఐఏఎస్‌ అధికారి అయిన బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎస్‌ రామ్మోహన్‌రావు, రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారులు పీవీ రావు, రంగిశెట్టి మంగబాబు, మాజీ ఐఏఎస్‌ లక్ష్మీకాంతంతో పాటు పారిశ్రామికవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లు సహా 25 మంది ప్రముఖులు ఉన్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ భోజన సమావేశంలో అసాధారణంగా మూడున్నర గంటలకు పైగా చర్చించారు. జంట నగరాల్లోని తెలగ, కాపు, ఒంటరి, బలిజ కులాల కోసం భవనం నిర్మించుకోవడానికి ఐదు ఎకరాల స్థలం, రూ.10 కోట్ల నగదు మంజూరు చేయాలని రిటైర్డ్‌ అధికారులు కోరారు. కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి.. కచ్చితంగా ఇస్తానని.. తానే ఆ భవనాన్ని ప్రారంభిస్తానని, వారు ఏం కోరినా చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే తెలంగాణలో ఉన్న 25 లక్షల మంది మున్నూరు కాపు ఓటర్లు తనకే మద్దతిచ్చేలా చేయాలని వారిని కోరారు. ఇక తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపైనే చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జగన్‌ తరఫున వారితో ఆయన మంతనాలు జరిపారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీతో జనసేన కలవకూడదని.. ఒంటరి పోరుకు పవన్‌ కల్యాణ్‌ను ప్రోత్సహించాలని కూడా సూచించినట్లు సమాచారం.

ఏం జరిగింది..?

శనివారం మేఘాలయ రిటైర్డ్‌ సీఎస్‌ కేఎం కుమార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ‘కాపు ఐకానిక్‌ గ్రూపు’ సమావేశం జరిగింది. 4 రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కాపు నేతలు కుటుంబాలతో తరలి వచ్చారు. మున్నూరు కాపుల ఓట్లపై కన్నుతో తెలంగాణ బీజేపీ నేతలే లు ఈ భేటీని ఏర్పాటు చేయించినట్లు కేసీఆర్‌కు తెలిసింది. దీంతో బీఆర్‌ఎస్‌ ఏపీ నేత తోట చంద్రశేఖర్‌ను పిలిపించుకుని.. తెలంగాణ, కాపు, ఒంటరి, బలిజ నాయకులను తీసుకురావాలని పురమాయించారు. ఆదివారం వారితో సమావేశమయ్యారు. సాధారణంగా ఆయన ఎవరికీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వరు. అలాంటిది తనంత తానే వారిని పిలిపించుకుని ఏకంగా మూడున్నర గంటలు చర్చించారు. తెలంగాణ రాజకీయాలపై కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపైనే ఎక్కువ సేపు మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రంలో జనసేన బలోపేతమవుతున్నట్లు తనకు రిపోర్టులు వస్తున్నాయని.. పవన్‌ కల్యాణ్‌ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారని.. ఇందుకోసం ఒంటరిగా పోటీచేసేలా ఆయనపై ఒత్తిడి తేవాలని, ఆయన్ను ప్రభావితం చేయాలని వారికి సూచించారు. బీఆర్‌ఎస్‌ బలోపేతం గురించి కాకుండా ఏపీలో కాపు ఓట్లు చీలిపోవాలని.. జగన్‌కు మేలు చేకూరాలన్న కోణంలోనే ఆయన మాట్లాడినట్లు విశ్వసనీయ సమాచారం. కాపుల ఓట్లు సంఘటితం కాకూడదని.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ-జనసేన వైపు మొగ్గకూడదని.. వారి ఓట్లు చీలిపోవాలని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఆంధ్రకు చెందిన కాపు నేతలతోనూ ఆయన నేరుగా సమావేశాలు జరుపుతున్నట్లు తెలిసింది. మూడ్రోజుల కింద ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల చోటా నాయకులను పిలిపించుకుని మాట్లాడారు. కాపు ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోవాలని స్పష్టీకరించారు. కానీ వీరెవరూ ప్రజాబలం ఉన్న వారు కాదు. కేవలం పదవీవిరమణ చేసిన అధికారులు, ఇతర ప్రముఖులు. రాబోయే కాలంలో మరిన్ని జిల్లాలకు చెందిన కాపు నేతలతో కేసీఆర్‌ సమావేశాలు జరుపనున్నట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.