కేజ్రీవాల్ పై వాటర్ బాటిల్లతో దాడి
గుజరాత్లో కేజ్రీవాల్ పై వాటర్ బాటిల్తో దాడ
గుజరాత్ పర్యటనలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్పై ఆగంతకుడు వాటర్ బాటిల్ తో దాడికి పాల్పడ్డాడు. గార్బా ఈవెంట్లో పాల్గొనేందుకు రాజ్కోట్ వెళ్లిన కేజ్రీవాల్పై ఆగంతకుడు వాటర్ బాటిల్ విసిరారు. గత నెలలో గుజరాత్ లో పర్యటించినప్పుడు కూడా వడోదర విమానాశ్రయంలో బీజేపీ, మోదీకి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కేజ్రీవాల్ విసుగు చెంది వెళ్లిపోయారు. శనివారం రాజ్కోట్లో గార్బా ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అరవింద్ కేజ్రీవాల్తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కూడా హాజరయ్యారు. ఈవెంట్ జరుగుతున్న వేదికపైకి వెళ్తుండగా.. వెనక నుంచి ఓ వ్యక్తి వాటర్ బాటిల్ను కేజ్రీవాల్పైకి విసిరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా, అంతకుముందు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేజ్రీవాల్.. ర్యాలీలో కూడా పాలుపంచుకున్నారు. అయినప్పటికీ ఎలాంటి భద్రతాపరమైన సమస్య రాలేదు. రాజ్కోట్లో గార్బా ఈవెంట్ మైదానంలో కేజ్రీవాల్పై నీళ్ల బాటిల్తో దాడి చేయడాన్ని నెటిజెన్లు, ఆప్ కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాగా, గుజరాత్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయడంతోపాటు కచ్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు నర్మదా నది నీరు అందిస్తామని కేజ్రీవాల్ చెప్పారు.