ర్యాగింగ్ కారణంగా కిడ్నీలు ఫెయిల్
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో ర్యాగింగ్ను ఆపాలని.. ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ర్యాగింగ్ భూతాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు కూడా తీసుకువచ్చాయి. అయినప్పటికీ ఇప్పటికీ కొన్ని సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కాలేజీల్లో యాజమాన్యాలు యాంటీ ర్యాగింగ్ గ్రూపులు, స్క్వాడ్ను ఏర్పాటు చేసినా.. ఈ ర్యాగింగ్ మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం దేశంలో తీవ్ర దుమారానికి కారణం అయింది. ర్యాగింగ్ పేరుతో జూనియర్ను తీవ్ర వేధింపులకు గురిచేసిన సీనియర్లు.. చివరికి అతడి ప్రాణాలపైకి తెచ్చారు. బలవంతంగా పుష్ అప్స్ చేయాలని బెదిరించడంతో.. ఆ విద్యార్థికి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఈ సంఘటన రాజస్థాన్లోని ఓ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుంది.
రాజస్థాన్లోని దుంగార్పూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని.. సీనియర్లు ర్యాగింగ్ చేశారు. గుజరాత్కు చెందిన ఆ జూనియర్ విద్యార్థి కాలేజీ క్యాంపస్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అదే కాలేజీలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ఏడుగురు సీనియర్లు.. అతడిని కాలేజీ సమీపంలో ఉన్న ఓ కొండపైకి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత పుష్ అప్స్ తీయాలని ఒత్తిడి చేశారు. 300 పుష్ అప్స్ తీయమని బలవంతం చేశారు. అయితే ఈ ఘటన మే 15 వ తేదీన జరగ్గా.. తాజాగా బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒకేసారి 300 పుష్ అప్స్ తీయడంతో ఆ జూనియర్ విద్యార్థి కిడ్నీలపై ఎఫెక్ట్ పడిందని దుంగార్పూర్ సదర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గిర్ధారి సింగ్ తెలిపారు. కిడ్నీలపై చాలా ఒత్తిడి పెరిగి.. ఇన్ఫెక్షన్ అయిందని.. ఆ తర్వాత అవి పనిచేయకుండా పోయాయని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత.. అతడికి తీవ్రమైన నొప్పి వచ్చిందని.. చివరికి అది భరించలేక గుజరాత్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్చినట్ల తెలిపారు.