కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు కిషన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆర్ధికశాఖ, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శిష్యుడు కిషన్ రెడ్డి అని, ఇక చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. కిషన్ రెడ్డి, చంద్రబాబు లాంటి ద్రోహులను అడ్డు పెట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు కిషన్ రెడ్డి వింటున్నారని, చంద్రబాబు చెప్పినట్లు రేవంత్ చేస్తున్నారని ఆరోపించారు.సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని శ్రీగిరిపల్లి గ్రామ పంచాయతీ కొత్త భవనాన్ని హరీశ్ రావు ప్రారంభించారు. సమైక్యాంధ్ర సీఎంలతో అంటకాగుతున్న వీరిద్దరితో మన తెలంగాణ బతుకులు ఆగమైపోతాయని తెలిపారు. ఈ సందర్బంగా బీజేపీ తీరుపై కూడా హరీష్ మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి వేలాది మంది రైతుల చావుకు బీజేపీ కారణమైందన్నారు. ఇక మూడు గంటల కరెంటు చాలని చెబుతూ తెలంగాణ ప్రజల శాపంగా కాంగ్రెస్ పార్టీ మారిందని విరుచుకుపడ్డారు.బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు హరీష్ రావు సూచించారు. మూడు పంటలు పండాలని చెప్పే కేసీఆర్‌ను కడుపులో పెట్టి చూసుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి పట్ల ముందు చూపుతో ఎవరు ఆలోచిస్తున్నారో ప్రజలే ఆలోచన చేయాలని తెలిపారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేసే పనిలో పడ్డారని, వారి మాయ మాటలు నమ్మకుండా కేసీఆర్‌ను నిండు మనస్సుతో దీవించాలని కోరారు.అటు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్, గౌరారం పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్‌కు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీతో కలసి హరీష్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, సిద్దిపేట్ పోలీస్ కమిషనర్ శ్వేత, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.