కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజుకున్నది. వచ్చే నెల 5న ప్రియాంక గాంధీ సభకు ముందుగానే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న జూపల్లి కృష్ణారావుకు చింతలపల్లి రూపంలో సెగ తగులుతున్నది. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్న కాంగ్రెస్కు జూపల్లి, చింతలపల్లి విభేదాలు అలజడి సృష్టిస్తున్నది. జూపల్లి కృష్ణారావు, చింతలపల్లి జగదీశ్వర్రావుకు మొదటి నుంచీ ఒకరంటే ఒకరికి గిట్టదు. 2009, 2012 ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోటీ చేశారు. రెండు ఎన్నికల్లో చింతలపల్లి ఎన్నికలకు దూరంగా ఉండగా, బీఆర్ఎస్లో చేరి డీసీసీబీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ నుంచి అప్పటికే కాంగ్రెస్లో చేరిన చింతలపల్లికి తాజాగా అదే పార్టీలో చేరుతున్న జూపల్లికి మధ్య సయోధ్య కుదరడం లేదు.ఇద్దరూ కాంగ్రెస్ టికెట్పైనే పోటీ చేయాలని భావిస్తుండటంతో ఇరు వర్గీయుల్లో ఉప్పు, నిప్పు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇద్దరు నేతల కొట్లాట కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ సభకు ముందే ఈ ఇద్దరు నాయకుల మాటలు కాకరేపుతున్నాయి. జూపల్లికి టికెట్ దక్కుతుందనే హామీతో కాంగ్రెస్లో చేరుతున్నారన్న ప్రచారం జోరందుకున్నది. ఇటీవల జరిగిన సమావేశాల్లో పీసీసీ నేత మల్లురవి మాట్లాడుతూ సర్వే ప్రాతిపదికనే టికెట్ల కేటాయింపు అని స్పష్టం చేశారు. దీన్ని చింతలపల్లి సహా మాజీ మంత్రి నాగం వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీని నమ్ముకుంటే, మధ్యలో వచ్చిన నాయకులకు టికెట్ ఇస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. సర్వేల పేరుతో టికెట్ ఇవ్వకుంటే తమ దారి తాము చూసుకుంటామని సంకేతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో జూపల్లికి ఆదిలోనే హంసపాదు ఎదురవువుతున్నది. రాష్ట్రంలో తన రాజకీయ ఉనికిని చాటుకుందామనుకుంటే సొంత నియోజకవర్గంలోనే మంటలు రేగడంతో ఆయన వర్గీయుల్లో నైరాశ్యం నెలకొంది.