ఎట్టకేలకు గాంధీభవన్ మెట్లెక్కిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: కొంతకాలంగా గాంధీభవన్కు దూరంగా ఉంటున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టకేలకు గాంధీభవన్ మెట్లెక్కారు. గాంధీభవన్కు రావడమే కాదు.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో ఇమడలేక, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల ఎజెండాతో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చర్చకు నిలిచారు. మునుగోడు ఉప ఎన్నికలో వెంకట్రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో రేవంత్రెడ్డిని టార్గెట్చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డితో పాటు రేవంత్రెడ్డి టార్గెట్గా కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ ఒక్కటై వేగంగా పావులు కదిపారు. నిన్నటి వరకూ రేవంత్ పేరు ఎత్తకుండా విమర్శలు చేసిన వారు.. ఇప్పుడు బాహాటంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు. అసంతృప్తి కాస్తా.. అసమ్మతిగా మారింది. ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి తర్వాత రేవంత్పై విమర్శల దాడి పెరగ్గా.. టీపీసీసీ కమిటీల కూర్పు దానికి మరింత ఆజ్యం పోసింది. టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలకు ప్రాధాన్యం ఇచ్చారంటూ సీనియర్ నేతలందరూ మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్కు ఇన్చార్జిగా మాణిక్ రావ్ ఠాక్రే ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. తెలంగాణ కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులను చల్లార్చేందుకు ఆయన ఈ రోజు గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశయ్యారు. ఈ నెల 26 నుంచి కాంగ్రెస్ చేపట్టనున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమానికి పార్టీ నేతలు, అనుబంధ సంఘాలను పూర్తిగా సమాయత్తపర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రచారం, ఎన్నికల నిర్వహణ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీలతో గాంధీభవన్లో మాణిక్ రావ్ విడివిడిగా భేటీ అయ్యారు. రేవంత్రెడ్డి, ఇంచార్జి కార్యదర్శులతో సమావేశమయ్యారు.