వైసీపీలో పెను ప్రకంపనలు రేపుతున్న కోటంరెడ్డి కామెంట్స్

-    త్వరలోనే అంతా చెప్పేస్తానంటూ సంచలనం..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వైసీపీ నుంచి సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకొస్తే చాలు.. ఆయన ఏం సంచలన విషయాలు బయటపెడతారో అని అధికార పార్టీలో ఒక్కటే టెన్షన్. పార్టీ నుంచి తొలగించక ముందు, ఆ తర్వాత కోటంరెడ్డి మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి అధికార పార్టీపై చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమే అయ్యాయి. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల కోసం పోరాడిన ఆయన.. ఇప్పుడు నెల్లూరు నుంచి రాజమండ్రికి వెళ్లారు. ఇటీవల టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసు, మామ అప్పారావులను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కోటంరెడ్డి.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మద్దతుగా నిలిచారు. ఇంతవరకూ అంతా ఓకే కానీ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు వైసీపీలో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? ఎప్పుడు చేరబోతున్నారు..? అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం..

ఆదిరెడ్డి అప్పారావు, వాసును అరెస్టు చేయడాన్ని కోటంరెడ్డి తీవ్రంగా ఖండించారు. వైసీపీ.. అక్రమ కేసులు బనాయించి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేయాలే గానీ కేవలం కక్ష సాధింపు చర్యలు సరికావు. దుష్ట సంప్రదాయాలు మంచిది కానే కాదు. ఆదిరెడ్డి ఏ తప్పు చేయకున్నా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. ఇవి ప్రభుత్వాలు కొనసాగిస్తే ప్రజాస్వామ్యంలో సరికాదు. అధికారం చేతిలో ఉంది కాబట్టి వేదిస్తానంటే ఎలా..?. రాజ్యాధికారం ఒకరికే శాశ్వతం కాదు. రాష్ట్రానికి రాజధాని ఒక్కటే ఉండాలి. మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి. రాజధానిపై చంద్రబాబు ఒక్కరే నిర్ణయం తీసుకోలేదు. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం ఇది. జగన్ కూడా అమరావతిని అసెంబ్లీలో ఆమోదించారు. ఆ రోజున జగన్ ఎందుకు వ్యతిరేకించలేదు..?. అందరం అమరావతి రాజధాని అని వైసీపీ ఎన్నికలలో చెప్పినమాటను మరోసారి నేను గుర్తు చేస్తున్నా. మూడు రాజధానులు రాష్ట్రానికి సరికాదు.. అక్కర్లేదు. అమరావతి రైతులు ప్రభుత్వాన్ని చూసి భూములిచ్చారు. ఈ రోజు నేను ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నాను. ఇష్టారాజ్యంగా పాలన చేస్తే అధికారులూ ఇబ్బంది పడతారు.. ఇది సభ్యసమాజం హర్షించదు అని లాజిక్‌లు వెతికి మరీ వైసీపీపై కోటంరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ కామెంట్స్‌తో వైసీపీ షేక్..!

ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో కోటంరెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘టీడీపీ, జనసేనలు టికెట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపితే వైసీపీ నుంచి 60-70 మంది ఎమ్మెల్యేలు బయటకొస్తారు. జగన్ కక్షసాధింపు చర్యలన్నింటినీ ప్రజలు గ్రహిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజా సునామీ రాబోతోంది. పట్టభద్రులు ఇచ్చిన తీర్పునే ప్రజలూ ఇస్తారు. రాజమండ్రిలో చంద్రబాబు జైలు పర్యటనకు అడ్డంకులు సృష్టించటం దుర్మార్గం’ అని కోటంరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. శ్రీధర్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు అటు వైసీపీలో.. ఇటు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ ఆ 60-70 మంది ఎమ్మెల్యేలు ఎవరు..? ఇందులో నిజానిజాలెంత..? ఆయన ఏదో మాట్లాడాలని అలా కామెంట్స్ చేశారా.. లేకుంటే నిజమే చెబుతున్నారా..? అని తెలుసుకునే పనిలోవైసీపీ పెద్దలు, ఐ ప్యాక్ టీమ్ ఉన్నారట.

పార్టీలో చేరికపై..!

ప్రస్తుతానికి తాను వైసీపీకి దూరంగా ఉన్నానని.. పలు పార్టీలు నుంచి ఆహ్వానాలు వచ్చినా ఆసక్తిగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికైతే ఏ పార్టీలో చేరలేదని.. టీడీపీలో ఎప్పుడు చేరతాననే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానన్నారు. కాగా అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కోటంరెడ్డి కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇద్దరూ సుమారు అరగంటకు పైగా చర్చించుకున్నారు. రాజమండ్రిలో ఏ ఇద్దరు చూసినా ఈ భేటీపైనే చర్చించుకుంటున్నారు.మొత్తానికి చూస్తే.. ఇవాళ ఏపీ రాజకీయాల్లో కోటంరెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు వైసీపీని షేక్ చేస్తున్నాయని విశ్వసనీయవర్గాల సమాచారం. కోటంరెడ్డి ఇన్ని కామెంట్స్ చేసినా వైసీపీ నుంచి ఇంతవరకూ కౌంటర్ రాకపోవడం చూస్తుంటే ఆయన మాటల్లో నిజముందో లేదో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు. కోటంరెడ్డి మాటల్లో నిజానిజాలెంతో తెలియాలంటే మరికొన్ని వేచి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.