పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. సాగర్ ప్రాజెక్టు 18 గేట్ల ఎత్తివేత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది. దీంతో జూరాల నుంచి శ్రీశైలం మీదుగా నాగార్జున సాగర్కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. ఉరకలేస్తోంది. భారీగా వరద వస్తుండటంతో.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 గేట్లను అధికారులు ఎత్తారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆ జల సవ్వడిని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 3,49,310 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 588.90 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 308.7641 టీఎంసీలుగా ఉంది. సాగర్ రిజర్వాయర్ నుంచి 3,11,926 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది.