మోడీ ప్రమాణ స్వీకారానికి అగ్ర దేశాల నేతలకు ఆహ్వానం
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు మరోసారి కొలువుదీరనున్నది. దేశానికి వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ (PM Modi) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నెల 8న ఆయన ప్రమాణస్వీకారం (Oath Ceremony) చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఢిల్లీలోని కర్తవ్యపథ్ శనివారం రాత్రి 8 గంటలకు మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు. మరోవైపు ఈ ప్రమాణ స్వీకారమహోత్సవానికి దక్షిణాసియా అగ్రనేతలను (Top South Asian leaders) కేంద్రం ఆహ్వానించినట్లు సమాచారం. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధినేతలకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఇక శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా ఇప్పటికే మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు. మోదీ ఆహ్వానాన్ని అంగీకరించినట్లు శ్రీలంక అధ్యక్ష కార్యాలయ మీడియా విభాగం తెలిపింది. శనివారం జరగనున్న కార్యక్రమానికి తమ అధ్యక్షుడు విక్రమసింఘే హాజరుకానున్నట్లు తెలిపింది. ఈ మేరకు విజయంపై ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్ ప్రధాని సైతం శనివారం నాటి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈవెంట్ కోసం ఆమె ఒకరోజు ముందే అంటే శుక్రవారమే ఢిల్లీకి చేరుకోనున్నారు.