తిరగబడదాం … తరిమికొడదాం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రభుత్వాలను ఓడించేందుకు కాంగ్రెస్‌ ఇచ్చిన నినాదంతో తిరగబడదాం, తరిమికొడదామని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఏఐసీసీ సభ్యుడు సంబాని చంద్రశేఖర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు కాంగ్రెస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ మోటారు సైకిల్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అభిమానులు గజమాలతో పొంగులేటిని సత్కరించారు. చిన్నకోరుకొండి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌లో సంబాని, పొంగులేటి ప్రసంగించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌(BJP, BRS) పార్టీలు రాష్ట్రంలో చీకటి ఒప్పంద రాజకీయాలు సాగిస్త్తున్నాయని వారు తీవ్రంగా విమర్శించారు. లిక్కర్‌ స్కామ్‌లో సంబంధం కలిగిన కవితను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేయకపోవటం అందుకు నిదర్శనమని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలో వచ్చే ముందు కేసీఆర్‌ మోసపూరితమైన హమీలు ఇచ్చి ప్రజలను మోసగించారన్నారు.జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్‌షా సభకు పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులను కేటాయించారని, అదే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సభకు ఎందుకు అనుమతించలేదని వారు కేసీఆర్‌ను ప్రశ్నించారు. కుట్రపూరితంగా పాలన సాగిస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పదికి పది సీట్లు కాంగ్రెస్‌ గెలవటం తథ్యమని వారు దీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు కొండూరి సుధాకర్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయబాబు, నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్‌, కాటేపల్లి కిరణ్‌కుమార్‌, కొండూరి కిరణ్‌కుమార్‌, యాసా వెంకటేశ్వరరావు, మట్టూరి జనార్ధన్‌, మద్దినేని లోకేష్‌, మోహన్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.