లిక్కర్ స్కామ్..ఆ విమానాశ్రయం మాయేనా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక వ్యక్తులు ముఖ్య పాత్ర పోషించారని ఈడీకి పక్కా ఆధారాలు అందాయని తెలుస్తోంది. ఈ కోవలోనే వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.అదేవిధంగా శరత్చంద్రారెడ్డి భార్య కనికారెడ్డికి చెందిన జెట్ సెట్ గో విమానాల్లోనే మాయాజాలమంతా నడిచిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగునాట ప్రధాన మీడియా సైతం ఈ కోణంలోనే కథనాలు ప్రచురిస్తోంది. ముఖ్యంగా ఆమె ప్రైవేటు విమానాలు అరెంజ్ చేసేవారని చెబుతున్నారు. ఆ ప్రైవేట్ విమానాల ద్వారా భారీ ఎత్తున డబ్బు తరలించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమానాలు వ్యక్తం చేస్తోంది.తాజాగా ఒక ప్రధాన పత్రిక సంచలన కథనం ప్రచురించింది. గన్నవరం విమానాశ్రయం నుంచే అసలు కథంతా నడించిందని పేర్కొంది. జగన్ ప్రభుత్వంలో కీలక ప్రజాప్రతినిధి ఒకరు తరచూ పెద్దపెద్ద సూట్ కేసులతో గన్నవరం నుంచి వెళ్తున్నారని.. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ సూట్ కేసులు ఉండటం లేదని బాంబుపేల్చింది. గన్నవరం విమానాశ్రయం నుంచి తరచూ ఈ వైసీపీ కీలక ప్రజాప్రతినిధి ఢిల్లీ వెళ్తున్నారని.. ఇందుకోసం ప్రైవేటు చార్టర్డ్ విమానాలు వినియోగిస్తున్నారని ఆ పత్రిక కథనం పేర్కొంంది.అంతేకాకుండా గన్నవరం విమానాశ్రయంలో తమకు అనుకూలురైన అధికారులను పెట్టుకుని పనికానిచ్చేస్తున్నారని ఆ పత్రిక వెల్లడించింది. కేంద్ర బలగాలు విజయవాడ విమానాశ్రయంలో ఉండాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు విమానాశ్రయంలో రక్షణ విధులు నిర్వర్తిస్తున్నారని ఆ పత్రిక వివరించింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారి పర్యవేక్షణలో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) విజయవాడ విమానాశ్రయానికి భద్రత కల్పిస్తోందని ఆ పత్రిక తన కథనంలో తెలిపింది.ఈ నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లిన చార్టర్డ్ విమానాలపై దృష్టి సారించిందని ఆ పత్రిక వెల్లడించింది. నెలకు 15కు తగ్గకుండా ఢిల్లీకి వెళ్తుండటంతో వాటిలో ప్రయాణించిన వ్యక్తుల వివరాలను ఈడీ సేకరిస్తోందని తెలిపింది.అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చార్టర్డ్ విమానాల్లో వెళ్లే వ్యక్తులు తీసుకెళ్లిన భారీ లగేజీని విమానాశ్రయంలో సరిగా తనిఖీ చేయడం లేదని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలురైన అధికారులను పెట్టుకుని.. సులువుగా తమ పని జరిగిపోయేలా వ్యవహరిస్తున్నారని ఆ పత్రిక పేర్కొంది. గన్నవరం విమానాశ్రయంలో ఉన్న గ్రౌండ్ లెవల్ సిబ్బందే వైసీపీ ముఖ్య ప్రజాప్రతినిధి తెచ్చిన సూట్ కేసులను చార్టర్డ్ విమానాల్లో సర్దుతున్నారని ఆ పత్రిక బాంబు పేల్చింది.గన్నవరం విమానాశ్రయం నుంచి చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించిన వ్యక్తుల పేర్లు కూడా పూర్తిగా కాకుండా ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటున్నాయని ఆ పత్రిక తెలిపింది. చార్టర్డ్ విమానాలు నడుపుతున్న కనికా రెడ్డి బంధువు కూడా సాయి‘ అని ఒకసారి విజయ్‘ అని మరోసారి ఎస్.విజయ్‘ అని ఇంకోసారి వీఎస్ రెడ్డి‘ అని కూడా విమానం అద్దెకు తీసుకున్నట్లు పేర్కొంది. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఓ నాయకుడు నేరుగా గన్నవరం రన్వే పైకి వాహనంలో వెళ్లి భారీ లగేజీతో ఢిల్లీ వెళుతున్నట్లు విజయవాడలో చర్చ జరుగుతోందని ఆ పత్రిక వెల్లడించింది.అదేవిధంగా గన్నవరం విమానాశ్రయంలో ఎక్కువ అధికారాలుండే అధికారి ఏపీ ప్రభుత్వ పెద్దల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. రాయలసీమకు చెందిన ఒక మంత్రి సిఫారసుతో ఆయన్ను నియమించినట్లు ప్రచారం జరుగుతోందని వివరించింది. తరచూ ఢిల్లీకి వెళ్లే ఆ మంత్రి కేంద్ర కేబినెట్లో తెలుగు మాట్లాడే మంత్రి ద్వారా ఈ అధికారిని విజయవాడలో నియమించేలా చేశారని ఆ పత్రిక బాంబుపేల్చింది.

Leave A Reply

Your email address will not be published.