డిసెంబర్ లోనే లోక్ సభ ఎన్నికలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనే లోక్‌స‌భ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు పాల‌క బీజేపీ పావులు క‌దుపుతున్న‌ద‌ని ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పేర్కొన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం కాషాయ పార్టీ అన్ని హెలికాఫ్ట‌ర్ల‌ను బుక్ చేసింద‌ని చెప్పారు. మ‌మ‌తా బెన‌ర్జీ సోమ‌వారం టీఎంసీ యువ‌జ‌న విభాగం చేప‌ట్టిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.బీజేపీ మూడోసారి అధికార ప‌గ్గాలు చేప‌డితే దేశం నిరంకుశ పాల‌న‌లోకి నెట్ట‌బ‌డుతుంద‌ని దీదీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు వెళ్లేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని, ఇత‌ర పార్టీల‌కు అవ‌కాశం లేకుండా ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం దేశ‌వ్యాప్తంగా హెలికాఫ్ట‌ర్ల‌ను ఆ పార్టీ బుక్ చేసింద‌ని దీదీ పేర్కొన్నారు. ఇప్ప‌టికే మ‌తాల మ‌ధ్య చిచ్చు రేపిన బీజేపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే దేశాన్ని అది విద్వేష జాతిగా మార్చేస్తుంద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.బెంగాల్‌లో మూడు ద‌శాబ్ధాల సీపీఎం పాల‌న‌కు తాను పాత‌రేశాన‌ని, అదేవిధంగా లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీని మ‌ట్టిక‌రిపిస్తాన‌ని ఆమె ధీమా వ్య‌క్తం చేశారు. జాద‌వ్‌పూర్ యూనివ‌ర్సిటీలో ఏబీవీపీ, బీజేపీ కార్య‌క‌ర్త‌లు గోలీ మారో నినాదాలు చేశార‌ని, వ‌ర్సిటీలో విద్వేష నినాదాలు చేసిన వారిని అరెస్ట్ చేయాల‌ని పోలీసుల‌కు సూచించిన‌ట్టు ఆమె తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.