శ్రీరాముడు అందరి మతాలకు చెందినవాడు
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు కేవలం హిందూ మతానికి మాత్రమే చెందినవాడు కాదని, అందరికీ చెందినవాడని అన్నారు. అఖ్నూర్ జిల్లాలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకులు మతపరమైన విభజనను సృష్టించి పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘హిందువులు ప్రమాదంలో ఉన్నట్లుగా’ ఎన్నికల సమయంలో ఎక్కువగా మాట్లాడతారంటూ పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. అయితే అలాంటి ప్రభావంలో పడవద్దని కశ్మీర్ ప్రజలకు ఆయన సూచించారు. ‘ఏ మతం కూడా చెడ్డది కాదు. మనుషులే అవినీతిపరులు. మతం కాదు. రాముడు కేవలం హిందూ మతానికి చెందిన వారికే కాదు, అందరికీ చెందినవాడు’ అని అన్నారు. ఎన్సీ చీఫ్ పదవి నుంచి తాను వైదొలగుతున్నట్లు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, తాను ఎప్పుడూ కూడా పాకిస్థాన్ వైపు మొగ్గు చూపలేదని ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జిన్నా వచ్చి తన తండ్రిని కలిశారని, అయితే ఆయనతో చేతులు కలిపేందుకు తాము నిరాకరించినట్లు తెలిపారు. జమ్ముకశ్మీర్ను విభజించిన కేంద్రం 50 వేల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఆ ఉద్యోగాలు ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా రావడంతోపాటు లడఖ్ ప్రాంతం తిరిగి కలిసి ఏకీకరణ జరిగే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ఎన్నికల ద్వారానే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు.