హైదరాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో పలు విమానాలు రద్దు అయ్యాయి. శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఒకేసారి పలు విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన విమానాలతో పాటూ ఇక్కడకు రావాల్సిన వాటిని కూడా ఎయిర్ ఇండియా సంస్థ  రద్దు చేసింది. ఆపరేషనల్ సమస్యలు కారణంగా తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, వైజాగ్, మైసూరు వెళ్లే విమానాలు రద్దయ్యాయి.

అలాగే చెన్నై, తిరుపతి , బెంగళూరు, మైసూరు నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన విమాన సర్వీసులను కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది. రద్దు విషయంలో తమకు ముందస్తుగా సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టుకు వచ్చాక సర్వీసులు రద్దైనట్టు తమకు తెలిసిందని 48 మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియా సిబ్బందిపై సీరియస్ అయ్యారు. దీంతో సంస్థ సిబ్బంది, ప్రయాణికులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ సమయం వృథా అయ్యిందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, టిక్కెట్ డబ్బులు రీఫండ్ చేస్తామని అధికారులు చెప్పడంతో వారు శాంతించారు. ప్రయాణికులంతా నిరాశతో ఎయిర్ పోర్టు నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు.

Leave A Reply

Your email address will not be published.