16 ఏళ్లకే మాస్టర్ డిగ్రీ.. చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కుర్రాడు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  హైదరాబాద్‌కు చెందిన అగస్త్య జైస్వాల్ అరుదైన రికార్డు సాధించాడు. 16 ఏళ్ల వయస్సులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. దీంతో ఇండియాలో అతి చిన్న వయస్సులో మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన తొలి కుర్రాడిగా చరిత్ర సృష్టించాడు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సోషియాలజీలో అగస్త్య జైస్వాల్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇటీవల విడుదలైన ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మొదటి డివిజన్ మార్కులతో అతడు ఉత్తీర్ణత సాధించాడు.

అగస్త్య జైస్వాల్‌కు ఇది తొలి రికార్డు కాదు. గతంలో కూడా అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 2020లో 14 సంవత్సరాలకే డిగ్రీ పూర్తిచేశాడు. దీంతో ఇండియాలో అతి చిన్న వయస్సులో డిగ్రీ పూర్తి చేసిన తొలి కుర్రాడిగా పేరు సంపాదించుకున్నాడు. మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో అగస్త్య జైస్వాల్ బీఏ డిగ్రీ పూర్తిచేశాడు. అంతకుముందు తెలంగాణలో 9 ఏళ్ల వయస్సులో SSC బోర్డు పరీక్షలు పాసైన తొలి కుర్రాడిగా నిలిచాడు. 16 ఏళ్లకే మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి దేశంలోనే అతి చిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన తొలి కుర్రాడిగా నిలవడంపై అగస్త్య జైస్వాల్ స్పందించాడు. ‘నా తల్లిదండ్రులే నాకు గురువులు. మా నాన్న అశ్విని కుమార్ జైస్వాల్, తల్లి భాగ్యలక్ష్మి జైస్వాల్ సపోర్ట్, ట్రైనింగ్‌తో సవాళ్లను ఎదుర్కొంటూ, ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నా’ అని తెలిపాడు.

ఇంతేకాకుండా అగస్త్య జైస్వాల్ గతంలో అనేక రికార్డులు నెలకొల్పాడు. కేవలం 1.72 సెకన్లలో A నుంచి Z అక్షరాలను అతడు టైప్ చేశాడు. అంతేకాకుండా అగస్త్య జైస్వాల్ రెండు చేతులతోనూ రాయగలడు. వీటితో పాటు ఇతడు జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్‌గా ఉన్నాడు. చిన్న వయస్సులోనే చరిత్రలు సృష్టిస్తున్న ఈ అగస్త్య జైశ్వాల్ ఎవరో కాదు.. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, యంగెస్ట్ రీసెర్చ్ స్కాలర్ నైనా జైశ్వాల్ తమ్ముడే అగస్త్య జైస్వాల్.

Leave A Reply

Your email address will not be published.