శివాలయంలో ధ్వజారోహణలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు స్వస్థలం పర్వతగిరిలో పర్వతాల గుడి శివాలయంలో ధ్వజారోహణ పూజలో సోమవారం పాల్గొన్నారు. పర్వతగిరిలోని పర్వతాల గుడి శివాలయాన్ని సందర్శించి, పనుల పురోగతిని పర్యవేక్షించారు. దాదాపు 850 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ శివాలయం కోసం ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి గుట్టమీద ఆలయం నిర్మించారు. దేవాదాయ శాఖ నుంచి 70 లక్షల రూపాయలు మంజూరు కావడంతో ఆ నిధులతో భక్తులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. 2023 జనవరి 26వ తేదీన పర్వతాల గుడి శివాలయం ప్రారంభోత్సవం చేయనుండగ నేడు ధ్వజస్తంభ ఆరోహణ చేశారు. అప్పటిలోగా గుట్ట మీద ఆలయానికి కావలసిన విద్యుత్తు, మంచినీటి వసతి, రవాణా, భక్తుల సదుపాయాల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ ధర్మకర్త కల్లెడ రామ్మోహన్ రావు గారు మంత్రికి వివరించారు. శివాలయం చుట్టుపక్కల ఉన్న దాదాపు 200 గ్రామాల నుంచి 2023 జనవరి 26వ తేదీన జరిగే ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శివాలయానికి వచ్చే భక్తుల వాహనాలను నిలిపేందుకు విశాలమైన స్థలంలో పార్కింగ్ సదుపాయం కల్పన కొనసాగుతోందన్నారు.

Leave A Reply

Your email address will not be published.