సిద్దిపేటలో భరోసా, సఖి కేంద్రాలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా, సఖి కేంద్రాలను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, ఏడీజీ శిఖా గోయల్‌తో కలసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళా సంరక్షణ కోసం

సఖి, భరోసా కేంద్రాలతోపాటు వర్కింగ్ ఉమెన్స్‌ హాస్టల్, బాల రక్ష భవన్ కేంద్రం కలిపి ఒకే చోట ఏర్పాటు చేశామన్నారు.ఇక్కడ బాధిత మహళలకు వ్యక్తిగత గోప్యతతో పాటు కౌన్సిలింగ్, లీగల్ సపోర్టుతో కూడిన రక్షణ లభిస్తుందని మంత్రి చెప్పారు. ఇలాంటి రక్షణ వ్యవస్థ ఉందని అందరికీ తెలిసేలా చర్యలు చేపడతామన్నారు. సీఎస్ఆర్ ద్వారా 1.8 కోట్ల రూపాయలతో సఖి, భరోసా కేంద్రాలను నిర్మించిన గొవ్రో పెట్రో కెమికల్ వారికి, లైబ్రరీని అందించిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ ఆకర్షణకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. సిద్దిపేటలో భరోసా, సఖి సెంటర్లు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో 2014లో ప్రారంభం చేసిన ఈ సెంటర్‌లు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మహిళా భద్రత కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. ఏడీజీ శిఖా గోయల్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం షీ టీమ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.దేశం మొత్తంలో తెలంగాణలో మాత్రమే ప్రతి పోలీస్ స్టేషన్‌ మహిళా విభాగం కలిగి ఉన్నదని శిఖా గోయల్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం చిన్నారులు, మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళల అక్రమ రవాణాను అరికడుతున్నామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.