మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు

- భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు  -  అర్జున్ రామ్ మేఘవాల్‌కు న్యాయ శాఖ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ను ఆ పదవి నుంచి తొలగించి, ఆయనకు భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖను అప్పగించారు. న్యాయ శాఖను అర్జున్ రామ్ మేఘవాల్‌కు అప్పగించారు. మోదీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేశారు. మేఘ్‌వాల్‌కు ప్రస్తుతం ఉన్న శాఖలతోపాటు అదనంగా న్యాయ శాఖను అప్పగించారు. ఈ ఆశ్చర్యకర పరిణామాన్ని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రస్తుతం పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల సహాయ మంత్రిగా పని చేస్తున్నారు. గతంలో ఆయన చీఫ్ విప్‌గానూ, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగానూ పని చేశారు. ఆయన రాజస్థాన్‌లోని బికనీర్ నియోజకవర్గం నుంచి 2009లో లోక్‌సభ సభ్యునిగా మొదటిసారి గెలిచారు. ఆయనకు 2013లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం లభించింది.తాజా మార్పుల ప్రకారం అర్జున్ రామ్ మేఘ్‌వాల్ న్యాయ శాఖ సహాయ మంత్రిగా, ఇండిపెండెంట్ ఛార్జ్‌తో వ్యవహరిస్తారు. సుప్రీంకోర్టు కొలీజియం విధానంతో కిరణ్ రిజిజు ఘర్షణ పడిన నేపథ్యంలో ఆయన న్యాయ శాఖ మంత్రి పదవిని కోల్పోయారు. న్యాయమూర్తులను నియమించే కొలీజియం విధానం పారదర్శకంగా లేదని కిరణ్ రిజిజు ఆరోపించిన సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు భూగోళ శాస్త్రాల మంత్రిత్వ శాఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ నిర్వహించారు. ఈ శాఖను కిరణ్ రిజిజుకు అప్పగించారు. కిరణ్ రిజిజు న్యాయ మంత్రి పదవిని 2021 జూలై 8న చేపట్టారు. ఆయన 2019 మే నుంచి 2021 జూలై వరకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జి)గా వ్యవహరించారు.

Leave A Reply

Your email address will not be published.