ఈనెల 15న తెలంగాణ రాష్ట్రానికి రుతుపవనాలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఓ వైపు ఎండలు ఠారెత్తిస్తుంటే.. వర్షాలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. జూన్ నెల మొదలై ఇప్పటికే వారం రోజులు గడుస్తున్నప్పటికీ నైరుతీరుతపనాల జాడ కానరాలేదు. రాష్ట్రానికి నైరుతీ రుతుపవనాలు ఎప్పుఎప్పుడొస్తాయా అని వేచిచూస్తుండగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం నిరాశకు గురిచేస్తోంది. రాష్ట్రానికి రుతుపవనాలు మరింత ఆలస్యంగా చేరుకోనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అండమాన్ సమీపంలో నైరుతి రుతుపవనాలు స్థిరంగా కొనసాగుతున్నాయని… రానున్న 48 గంటల్లో కేరళ తీరానికి తాకే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఈనెల 15న తెలంగాణ రాష్ట్రానికి రుతుపవనాలు తాకే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర చత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ద్రోణి కొనసాగనుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు ఆలస్యం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగనున్నాయి. రెండు రోజులు రాష్ట్రమంతటా 40°C నుంచి 45°C మధ్యలో ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వడగాలులు కూడా ఉంది వీచే అవకాశం ఉంది. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, కొత్తగూడెం జిల్లాల్లో వడగాలులు వీచగా.. రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల్ జిల్లాల్లో వడగాలులు రానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.