జేడీయూ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జనతాదళ్ యునైటెడ్ అధ్యక్ష పగ్గాలను తిరిగి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన చేతుల్లోకి తీసుకున్నారు. బీహార్ అధికార జేడీయూ అధ్యక్షుడిగా నితీష్ శుక్రవారంనాడిక్కడ జరిగిన పార్టీ జాతీయ ఎక్సిక్యూటివ్ సమాశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతవరకూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లలన్ సింగ్ రాజీనామా చేసిన కొద్ది సేపటికే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టారు.బీహార్‌లో జేడీయూ భాగస్వామ్య పార్టీ అయిన లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్‌‌కు(ఆర్జేడీ) లలన్ సింగ్ దగ్గర కావడం వల్లే ఆయనను తొలగించారనే ప్రచారం జరిగింది. దీనిపై సమావేశం పూర్తయిన వెంటనే మీడియా అడిగిన ప్రశ్నకు లలన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ”ఆగ్రహమా? ఎందుకు ఆగ్రహం? నేనెందుకు ఆగ్రహం చెందాలి. ఈ మాట వినడం ఇదే మొదటిసారి” అని అన్నారు.

కాగా, ఆర్జేడీతో త్వరలో జేడీయూ విలీనం అవుతుందని లాలూ ప్రసాద్ యాదవ్ తనకు చెప్పినట్టు బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా నితీష్‌‌ను ఆలోచింపజేసిందని చెబుతున్నారు. అదీగాక, ‘ఇండియా’ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా తనను ఫోకస్ చేయడంలో లలన్ సింగ్ విఫలమయ్యారని నితీష్ అభిప్రాయపడినట్టు చెబుతున్నారు. అయితే, ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీ పొత్తును అస్థిరపరచేందుకు బీజేపీ కట్టుకథలు అల్లుతోందని ఆయన మండిపడ్డారు.

లలన్ ఐచ్ఛికంగానే రాజీనామా చేశారు..

కాగా, లలన్ సింగ్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తన నియోజకవర్గంపై మరింత ఎక్కువ సమయం కేటాయించాలని అనుకున్నారని, ఆ కారణంగానే ఆయన జేడీయూ అధ్యక్ష పదవిని ముఖ్యమంత్రికి అప్పగించాలని కోరుకున్నారని, అందుకు నితీష్ అంగీకరించారని బీహార్ మంత్రి విజయ్ కుమార్ చౌదరి తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తుండటం, ప్రధాన మంత్రి రేసులో నితీష్ కుమార్ ఉన్నారనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో జేడీయూ చీఫ్‌గా తిరిగి ఆయన పగ్గాలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Leave A Reply

Your email address will not be published.