తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎప్పుడూ ఏదో ఒక రూపంలో నష్టపోతున్న రైతన్నలకు చైనా శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. ప్రతీ ఏడాది రెండు సార్లు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికి అందుతుందో లేదన్న భయానికి స్వస్తి పలికేలా నూతన ఆవిష్కరణ చేసినట్లు ప్రకటించారు.
ఒక్కసారి నాటిన వరి నారు ఎనిమిది సార్లు కోతకు వస్తే.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ కలను చైనా శాస్త్రవేత్తలు ప్రూవ్ చేసి మరీ చూపించారు. పీఆర్-23 పేరుతో నూతన వరి వంగడాన్ని సృష్టించారు. నిజానికి ఈ నూతన వరి వంగడాన్ని సైంటిస్టులు నాలుగేళ్ల క్రితమే దానిని అక్కడి రైతుల చేతికి ఇచ్చారట. ఒక్కొక్క సీజన్లో ఎకరాకు సగటున 27 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒకసారి వరి కోసిన తర్వాత పిలకలకు నీళ్లు పెడితే మళ్లీ అది ఎదిగి, వరి కంకులు వేస్తుంది. ఇప్పటికే చైనా రైతులు అక్కడ 40 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆ దేశంలో మంచి ఫలితాలు ఇవ్వడంతో మిగిలిన వారంతా దీనిపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు దుక్కి, వరినాట్లకు అయ్యే ఖర్చులతో పాటు నీటి వినియోగం కూడా గణనీయంగా తగ్గుతం వారికి మరింత ఊరటనిస్తోంది. సాగు నీటి వాడకం 60%, కూలీల ఖర్చు 58%, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యయం 49% వరకు కలిసి వస్తుందని చైనా పరిశోధనల్లో తేలింది. దీంతో పీఆర్-23 వంగడం మన దేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలమో కాదో తేల్చేందుకు అధ్యయనం చేయాలని ICAR అంటే.. భారత వ్యవసాయ పరిశోధనా మండలి దేశంలోని వ్యవసాయ పరిశోధనా సంస్థలను ఆదేశించింది.
ICAR సూచనలతో రాజేంద్రనగర్లోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ అధ్యయనం చేపట్టింది. భారతదేశం సమశీతోష్ణ మండలంలో ఉండడంతో ప్రతి 4 నెలలకో సీజన్ మారుతుందని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఒకే నెలలో వాతావరణ మార్పులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని, పంటలను తెగుళ్లు చుట్టు ముడుతున్నాయని అంటున్నారు. చైనా ఆహారపు అలవాట్లు, వాతావరణం భారత్ కు భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఒకవేళ ఈ వరి వంగడం భారతదేశంలోనూ కూడా వస్తే తెలుగు రాష్ట్రాల రైతులకు నిజంగా శుభవార్తే అవుతుంది.