ఓవర్ కాన్ఫిడెన్స్ ఓడించిందా.?

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఓటమికి ఓవర్ కాన్ఫిడెన్స్ కారణమా… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి మళ్ళీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ నే కారణమా.. అంటే అవును అనే సమాధానమే క్షేత్రస్థాయిలో వస్తోంది. రెండు సందర్భాల్లోనూ అధికార పార్టీ గెలుపుపై అతి నమ్మకం పెట్టుకోవడం, ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం.. సొంత పార్టీ నేతల అవినీతి, అక్రమాలు, అరాచకాలు.. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు సడలడం.. ఇలా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అప్పుడు టీడీపీ వైసీపీని తక్కువ అంచనా వేస్తే.. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ను తక్కువ అంచనా వేయడం రెండు సందర్భాల్లో అనూహ్య ఫలితాలకు కారణంగా చెప్పవచ్చు. అలాగే, మోడీ, బీజేపీ మీద వ్యతిరేకత ఇరు సందర్భాల్లోనూ ఉండటం యాదృచ్చికం కావచ్చు. లోతుగా చెప్పాలంటే.. సేమ్ సీన్ రిపీట్ అయింది.. సేమ్ సిట్యుయేషన్ మరోసారి పునరావృతం అయింది. నాలుగేళ్ళ క్రితం 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయితే టీడీపీ, బీజేపీ, వైసీపీ మధ్య పరిస్థితులు కనిపించాయో.. ఇప్పుడు 2023 తెలంగాణా ఎన్నికల ఫలితాల్లోనూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య సేమ్ సీన్ స్పష్టం అయింది. 2014 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తులో అధికారంలోకి  వచ్చిన టీడీపీ ఆ తర్వాత విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఇతరత్రా విషయంలో బీజేపీతో విభేదించడం తెలిసిందే. సాక్షాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ మీదే తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ఓవర్ కాన్ఫిడెన్స్, జన్మభూమి కమిటీల తప్పిదాలు, టీడీపీ నాయకుల మధ్య అంతరాలు.. ఇలా అనేక కారణాలతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.. ఇదే సమయంలో అనూహ్యంగా 151 స్థానాలు దక్కించుకుని వైసీపీ రికార్డు సృష్టించింది. మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న టీడీపీని వార్ వన్ సైడ్ గా వైసీపీ దెబ్బకొట్టింది. ఇక్కడ వైసీపీని తక్కువ అంచనా వేయడం టీడీపీ తప్పిదం అయితే.. ఒక్క ఛాన్స్ సెంటిమెంట్ వైసీపీకి బాగా కలిసొచ్చింది. ఇక, ప్రత్యేక తెలంగాణా సాధించాక తొలి, మలి దఫాల్లో రెండు సార్లు అధికారాన్ని చేబట్టి పాలన అందించింది టీఆర్ఎస్. ఈ దఫా కూడా అధికార పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్ళూరింది. అందుకు తగ్గట్లుగానే కేసీఆర్, కేటీఆర్ తమదైన వ్యూహాలు రచించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలహీనంగా కనిపించడం, ఆ పార్టీ ముఖ్య నాయకులు పూర్తి యాక్టివ్ గా లేకపోవడంతో బీఆర్ఎస్ తమ గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని భావించింది. అయితే, తెలంగాణ టీడీపీని వదిలి రేవంత్ రెడ్డి టి.కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం.. *హస్తవాసి*గా మారి సారధ్య బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ శిబిరం ఆశలు రేకెత్తాయి. ఎన్నో ప్రయాసలతో కాంగ్రెస్ నేతలను ఒక్కతాటి పైకి తీసుకురావడం ద్వారా రేవంత్ రెడ్డి తొలి అడుగు వేశారు. కేసీఆర్ పై పదునైన విమర్శనాస్త్రాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం కేసీఆర్ శిబిరంలో కాస్త గుబులు పుట్టించిందనే చెప్పొచ్చు. అయితే, తెలంగాణ సెంటిమెంట్తో బలంగా ఉన్న బీఆర్ఎస్.. తమ అధికారాన్ని దెబ్బకొట్టే స్థాయిలో టి.కాంగ్రెస్ ఉండబోదన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు వారి కొంప ముంచింది.  ఓటుకు నోటు సమస్యను ధైర్యంగా ఎదుర్కొని నిలబడటంతో పాటు.. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయడం, సీతక్కతో సహా భట్టి, వీహెచ్ వంటి ముఖ్య నేతలను సమన్వయం చేసుకోవడం.. ఇలా అనేక అంశాలతో టి.కాంగ్రెస్ బలోపేతం చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో బీజేపీతో కేసీఆర్ వైరం పెంచుకోవడం, మోడీపై ఘాటు విమర్శలు చేయడం, గవర్నర్ తమిలి సై పట్ల నిర్లక్ష్యం, రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేయడం, రాజయ్య వంటి టీఆర్ఎస్ నాయకుల వ్యక్తిగత చర్యలు.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలన్న ఆశయానికి శరాఘాతంగా మారాయి. ఓ దశలో వైఎస్ఆర్టీపీ పేరుతో పార్టీ పెట్టి.. షర్మిల చేపట్టిన పాదయాత్ర కాంగ్రెస్ ఓట్లను చీలుస్తుందని భావించినా చివరి క్షణంలో ఆమె ఝలక్ ఇవ్వడం కీలకంగా మారింది. బీఆర్ఎస్ వ్యతిరేకత ఓటు చీలకుండా కాంగ్రెస్కు అవి చేరాలని తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. మొత్తంగా కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ వ్యూహం బీఆర్ఎస్ పరాజయానికి కారణమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నాడు టీఆర్ఎస్ (నేడు బీఆర్ఎస్),  కాంగ్రెస్ కీలకమయ్యాయి. అందుకే రెండుసార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలు.. ఇప్పుడు ఒక్కఛాన్స్ అంటూ ముందుకొచ్చిన కాంగ్రెస్కు పట్టం కట్టారు. తద్వారా సోనియాకు తమ ధన్యవాదాలు తెలిపారు. ఇక దుబ్బాక ఉప ఎన్నిక అనూహ్య విజయంతో తెలంగాణలో పాగా వేసిన బీజేపీ.. అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరింది. అయితే, అందుకు తగ్గట్లుగా పార్టీని, క్యాడర్ను బలోపేతం చేసుకోకపోవడం.. కర్ణాటక ఎన్నికల ఫలితాల నుంచీ పాఠాలు నేర్చుకోకపోవడం, బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను రాబట్టు కోలేకపోవడంతో అధికార పగ్గాలు అందుకోలేక పోయింది. అయితే, ఆశించిన స్థానాలకు మించి దక్కించుకోవడం వారికి కాస్త ఆనందించదగిన అంశంగా చెప్పవచ్చు.

Leave A Reply

Your email address will not be published.