కిక్కిరిసి పోయిన అమీర్ పెట్ మెట్రో స్టేషన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ మెట్రోకు ఎప్పుడూ లేనంత ఆదరణ పెరుగుతోంది. ఈ ఎండాకాలంలో, బస్సుల్లో హెవీ ట్రాఫిక్‌లో వెళ్తూ ఉక్కపోతకు తట్టుకోలేక జనాలు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా మెట్రో స్టేషన్లు, రైళ్లు బాగా రద్దీగా మారాయి. అమీర్ పేట్ మెట్రో స్టేషన్‌లో అయితే గురువారం మధ్యాహ్నం ఇసుక వేస్తే రాలనంత జనం కనిపించారు. ప్లాట్‌ఫాంలు, ఎస్కలేటర్లు ఎక్కడ చూసినా జనసంద్రమే కనిపించింది. నాగోల్ నుంచి రాయదుర్గం రూట్ అయితే రైల్లో ఎక్కేందుకు కూడా స్థలం లేని పరిస్థితి నెలకొంది. నాగోలు స్టేషన్ కూడా మొత్తం ప్రయాణికులతో నిండిపోయింది.

సాధారణంగా రద్దీని బట్టి వివిధ సమయాల్లో ప్రతి ఐదు నిమిషాలకు, లేదా ఏడు నిమిషాలకు లేదా పదిహేను నిమిషాలకు మెట్రో రైళ్లను నడుపుతుంటారు. కానీ, నాగోలు, అమీర్ పేట మెట్రో స్టేషన్లలో జనాన్ని చూస్తే, నిమిషానికి ఒక రైలు చొప్పున ఫ్రీక్వెన్సీతో నడిపినా జనాల రద్దీ తగ్గేలా కనిపించలేదు. ఎండాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి మెట్రో రైలు సంస్థ సర్వీసుల సంఖ్య పెంచింది. కానీ, గురువారం అనూహ్యంగా ఎప్పుడూ చూడని రీతిలో జనాలు కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నాగోలు, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్ నగర్, కూకట్ పల్లి నుంచి వివిధ ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపారాలు, చదువుల కోసం జనాలు రాకపోకలు సాగిస్తుంటారు.

చిరు ఉద్యోగస్తులు లేదా విద్యార్థులు బస్సులో ఛార్జీ తక్కువగా ఉంటుందని సాధారణ రోజుల్లో బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు బాగా ఎండలు ముదిరిపోవడంతో చల్లగా ఉంటుందని జనాలు మెట్రో రైళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.

Leave A Reply

Your email address will not be published.