రాత్రిపూట సంభవించిన బెరిల్ హరికేన్
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: 4 జులై 2024
రాత్రిపూట సంభవించిన భయంకరమైన బెరిల్ హరికేన్ నుండి బయటపడిన కత్రినా కాయ్కు, తాను నివసించే యూనియన్ ద్వీపంలో జరిగిన విధ్వంసాన్ని చూశాక మతిపోయింది.
సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్కు సమీపంలో ఉన్న ద్వీపంలో దాదాపు ప్రతి ఇల్లు ధ్వంసమైందని ఆమె చెప్పారు.
“బెరిల్ హరికేన్ ప్రభావం తగ్గిన తర్వాత చూస్తే యూనియన్ ఐలాండ్ ఘోరంగా దెబ్బతింది. దాదాపు ద్వీపమంతా నాశనమైంది.” అని ఆమె ఒక వీడియో సందేశంలో తెలిపారు.
కొన్ని భవనాలు మాత్రమే హరికేన్ ధాటిని తట్టుకుని నిలిచాయి. చాలా ఇళ్లు కూలిపోయాయి. నేలమట్టమైన ఇళ్లతో రోడ్లన్నీ బ్లాక్ అయ్యాయి. వీధుల్లో కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.
“నేను సర్వస్వం కోల్పోయాను. ఎక్కడ ఉండాలో తెలియడం లేదు” అని ఆ ప్రాంతంలో చేపలుపట్టుకుని జీవించే సెబాస్టియన్ సెయిలీ ఆవేదన వ్యక్తం చేశారు.
1985 నుండి తాను యూనియన్ ఐలాండ్లో నివసిస్తున్నానని ఆయన వెల్లడించారు.
‘‘2004 లో వచ్చిన ఇవాన్ హరికేన్ను కూడా తట్టుకున్నాను. కానీ ఇప్పుడు వచ్చిన హరికేన్ దానిని మించి భయంకరమైంది.’’ అని ఆయన అన్నారు.
హరికేన్ కలిగించిన భయం ఆయన గొంతులో ప్రతిధ్వనించింది.