ఏపీ లోని పలు గ్రామాల ప్రజలకు నిద్ర కరువు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అడవి జంతువుల్లో అతి ముఖ్యమైన ఎంతో విలువైన జీవిగా పులికి పేరుంది. అయితే వేటగాళ్లు పులి చర్మం, పులి గోళ్ల కోసం వేటాడుతుంటారు. అడవి జంతువులను వేటాడకూడదనే వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా ఇలాంటి వారికి అడ్డుకట్ట వేసి అడవి జంతువులను ఎంతో భద్రంగా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అడవుల్లో సరైన ఆహారం, నీరు దొరక్కపోవడంతో జంతువులు మైదాన ప్రాంతాల్లోకి వచ్చేస్తన్నాయి. గత ఏడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) శంఖవరం శివారు ప్రాంతంలో పులి సంచరించింది. దీంతో భయపడ్డ రైతులు, గ్రామాల ప్రజలు అటవీశాఖ అధికారుల సహాయం తీసుకున్నారు. దీంతో పులి కోసం కెమెరాలను ఏర్పాటు చేసిన సమయంలో పులి కెమెరాల్లో చిక్కింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం చెందాయి. చివరకు దాని మార్గంలో అది మళ్లీ అడవీ బాట పట్టింది. ఇదిలా ఉంటే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి పులి సంచలనం సృష్టించింది. గోకవరం దగ్గర అచ్యుతాపురం వద్ద పులి అడుగు జాడలు గుర్తించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు అవి పులి అడుగు జాడలో కాదో తేల్చే పనిలో నిమగ్న మయ్యారు. అయితే ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని అటవీశాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు.
పులి అడుగులుగా ఉన్న ముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు అవి అటవీపందుల అడుగులుగా తొలుత అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పులిని ప్రత్యక్షంగా చూసినట్లు రైతులు చెబుతుండటంతో మరింత ఆందోళన మొదలైంది. రైతులు దూరం నుండి చూసింది పులా మరేదైనా జంతువా అనే కోణంలో అటవీశాఖ అధికారులు నిఘా ఉంచారు. ప్రస్తుతం అక్కడ ప్రాంతంలో పులి ఉందన్న వార్తలు వ్యాపించడంతో జనం వణికిపోతున్నారు. రైతులు, గ్రామాల ప్రజలు ఆందోళన చెందొద్దని అటవీశాఖ అధికారుల భరోసా ఇస్తున్నారు.