బీసీలను విస్మరించడం వల్లే ప్రభుత్వాలపై సన్నగిల్లిన ప్రజల విశ్వాసం ..
- బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గడచిన తొమ్మిదేళ్లుగా బీసీల ఆకాంక్షలను అర్ధం చేసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు..2018 లో పార్లమెంటు సాక్షిగా అప్పటి హోం శాఖామాత్యులు రాజ్ నాథ్ సింగ్ 2021 జనాభా సర్వేలో బీసీ కులగణన చేపడతామని చెప్పి రెండోసారి 2019 లో అధికారంలోకి వచ్చి బీసీ జనగణనను విస్మరించడం వల్లనే ప్రజల అసంతృప్తిని బీజేపీ పార్టీ చవిచూడాల్సి వస్తుందన్నారు. బీసీ లకు విద్య ఉద్యోగాలలో లభించిన రిజర్వేషన్ లను చట్టసభల్లో సహితం కల్పించడానికి బీసీ ప్రధాని హయాంలో కావాల్సిన ఓకే ఒక రాజ్యాంగ సవరణ నేటికీ చేయకుండా 10 శాతం EWS రిజర్వేషన్ లను ఒకే రోజులో ముగించేయడం ప్రజలకు బీజేపీ మర్మాన్ని తెలియజేసిందని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహితం స్థానిక సంస్థలలో బీసీ ల రేజర్వేషన్లను 21 శాతానికి తగ్గించడం,బీసీ కార్పొరేషన్ ,ఫెడరేషన్ లలో బీసీ ల నాయకత్వాన్ని ఎదగనీయకుండా అణచివేయడం, ఎమ్మెల్యేలుగా,ఎమ్మెల్సీలుగా,నామినేటెడ్ పదవులలో బీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పించక పోవడాన్ని బీసీలు క్షుణ్ణంగా గమనిస్తున్నారన్నారు.. 45 లక్షల బీసీ కుటుంభాలున్న తెలంగాణాలో 5.28 లక్షల దరఖాస్తులు మాత్రమే బీసీలకు లక్ష సాయానికి వచ్చాయనడం బీసీలను వంచించడమేనన్నారు. విడుదల చేసిన 100 కోట్లతో లబ్ది చేకూరేది కేవలం 10 వేలమందికే నన్న సంగతి, అవి ఎమ్మెల్యేల అనుచరుల కోసమేనన్న విషయం కూడా బీసీలకు తెలియంది కాదన్నారు..ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసపూరిత వాగ్దానాలతో మభ్యపెట్టడం మాని నిబద్దతతో బీసీల పక్షాన నిలబడి రానున్న ఎన్నికలలో నష్ట నివారణ దిశగా ముందుకెళ్లాలని హితవు పలికారు..