చైనా దాడి విషయంలో ప్రధాని మోదీ విభిన్న స్టోరీ వినిపిస్తారు
- ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ వ్యవహారం వెలుగుచూసిన అనంతరం బీజేపీ ప్రభుత్వంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. చైనా గత అనుభవాల నుంచి నేర్చుకుందని ప్రధాని చైనా దాడి విషయాన్ని ఎప్పటికీ అంగీకరించరని దుయ్యబట్టారు. భారత భూభాగంపై చైనా దాడి విషయంలో ప్రధాని మోదీ తన మీడియా ద్వారా విభిన్న స్టోరీ వినిపిస్తారని ఎద్దేవా చేశారు.2022 ఆగస్ట్లో చైనా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో దళాలను 75 శాతం పెంచిందని ఓవైసీ పేర్కొన్నారు. డోక్లాం, దెసాంగ్, గల్వాన్, డెమ్చోక్ల్లో అనుభవాల నుంచి చైనా నేర్చుకుందని, కానీ ప్రధాని మోదీ మాత్రం ఈ దాడిని ఎన్నటికీ అంగీకరించరని, పైగా తన మీడియా స్నేహితుల ద్వారా డ్రాగన్ దాడికి భిన్న భాష్యాలు చెబుతారని ఓవైసీ ట్వీట్ చేశారు. తవాంగ్ సెక్టార్లో చైనా, భారత్ సైనికుల ముఖాముఖి తలపడిన ఘటనలో ఇరు దేశాల సైనికులకు గాయాలయ్యాయని భారత సైన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.కాగా చైనా దాడిపై తాను వాయిదా తీర్మానం ప్రవేశపెడతానని ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్లో భారత్ బలగాలను ఎందుకు తగినంతగా మోహరించలేదని ఓవైసీ ప్రశ్నించారు. డోక్లాం, లడఖ్లో గతంలో డ్రాగన దుందుడుకు చర్యల అనుభవాల నేపధ్యంలోనూ మన బలగాలను అరుణాచల్ ప్రదేశ్లో ఎందుకు అధిక సంఖ్యలో మోహరించేలా చర్యలు చేపట్టలేదని మోదీ సర్కార్ను నిలదీశారు.