సముద్ర జలాల్లో డైవింగ్ మాస్క్ను ధరించి స్విమ్మింగ్ చేసిన ప్రధాని మోదీ
లక్షద్వీప్ ప్రశాంతత మంత్రముగ్దుల్ని చేస్తుంది: మోదీ
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రెండు రోజుల పర్యటనలో భాగంగా లక్షద్వీప్లో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాహసోపేతమైన స్నార్కెలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్వాస తీసుకునేందుకు ట్యూబ్తో (స్నార్కెల్) అనుసంధానించిన డైవింగ్ మాస్క్ను ధరించి సముద్ర జలాల్లో ఆయన స్విమ్మింగ్ చేశారు. స్నార్కెలింగ్ విధానంలో తల సహా పూర్తి శరీరాన్ని నీళ్లలో ఉంచి, ముఖాన్ని కిందికి ఉంచి స్విమ్మింగ్ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు.ఒక ట్వీట్లో తాను స్నార్కెలింగ్ చేసిన ఫొటోలను పంచుకున్నారు. సముద్ర జల చరాల ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. మరో ట్వీట్లో షేర్ చేసిన ఫొటోలలో ప్రధాని మోదీ ప్రశాంతంగా సేదతీరుతూ కనిపించారు. తెల్లటి కుర్తాలో కనిపించగా బ్యాక్గ్రౌండ్లో ఇసుక, సముద్రపు నీళ్లు ఆహ్లదకరంగా ఆకట్టుకున్నాయి. తెల్లటి చెప్పులు ధరించి బీచ్లో అటు ఇటు సరదాగా షికారు చేశారు.
లక్షద్వీప్ ప్రశాంతత మంత్రముగ్దుల్ని చేస్తుంది: మోదీ
‘‘ సాహసాలు చేయాలనుకునేవారు లక్షద్వీప్ను మీ జాబితాలో చేర్చుకోండి. నా విడిది సమయంలో స్నార్కెలింగ్ని ప్రయత్నించాను. ఇది నిజంగా అద్భుతమైన అనూభూతి!’’ అంటూ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ‘‘ ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత కూడా మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింతగా కష్టపడి ఎలా పని చేయాలో లక్షద్వీప్ ఆలోచన కలిగించింది’’ అని మరో ట్వీట్లో పేర్కొన్నారు