ఐపీసీ సీఆర్‌పీసీ చట్టాలలో సమూల మార్పులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఐపీసీ సీఆర్‌పీసీ చట్టాలలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ చట్టాల్లో చాలా మార్పులు రానున్నాయని సంచలన ప్రకటన చేశారు. మాదక ద్రవ్యాల వ్యాపారులపై కఠినమైన శిక్షలు విధించబడ్డాయన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన పోలీసు వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్‌లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ వ్యాన్‌లు.. కేసులను త్వరగా ఛేదించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో సహాయపడతాయన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్లు.. 6 సంవత్సరాలు కంటే ఎక్కువ శిక్ష విధించే కేసులలో చాలా ముఖ్యమైనవన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా వామపక్ష తీవ్రవాదాన్ని దాదాపు అదుపులోకి తీసుకువచ్చామని అమిత్ షా పేర్కొన్నారు. ఈశాన్య భారతంలో… ఉన్న తీవ్రవాద గ్రూపులతో చర్చలు జరిపి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చామన్నారు. స్వాతంత్య్రానికి ముందు పోలీసుల పనిలో సేవ లేదని.. ఇప్పుడు అది మారిందన్నారు. కరోనా సమయంలో… ఢిల్లీ పోలీసులు చేసిన సేవలు అమోఘం అని హోం మంత్రి ప్రశంసించారు. జీ-20 (G-20) ఈవెంట్‌కు పలు దేశాల అధ్యక్షులు హాజరవుతున్నందున ఢిల్లీ పోలీసులు చాలా అప్రమత్తంగా ఉండాలని అమిత్ షా సూచించారు.

Leave A Reply

Your email address will not be published.