తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ఢిల్లీ: దేశం కోసం భారతీయ జనతా పార్టీ కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై పెద్దల సభ మంగళవారంనాడు దద్దరిల్లింది. ఖర్గే క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ అందుకు నిరాకరించడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.మల్లికార్జున ఖర్గే సోమవారంనాడు రాజస్థాన్లోని ఆల్వార్లో జరిగిన భారత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన ర్యాలీలో బీజేపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. ”సింహంలా మాట్లాడుతూ చిట్టెలుక లాగ ప్రవర్తిస్తారు. సరిహద్దుల వెంబడి దురాక్రమణలకు దిగుతున్న చైనాపై ఎలాంటి చర్యలూ తీసుకోదు. పార్లమెంటులో చర్చ జరపకుండా పలాయనం చిత్తగిస్తుంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం కాంగ్రెస్ నిలబడిందని, స్వాతంత్ర్య సముపార్జనకు పాటుపడిందన్నారు. ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారని చెప్పారు. ”బీజేపీ దేశం కోసం కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదు. అయినా సరే తామే దేశభక్తులమని చెబుతుంటారు. మేము (కాంగ్రెస్) ఏదైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు” అని విమర్శలు గుప్పించారు.