ముస్లింలతో రాఖీ పండుగ

.. బీజేపీ కార్యకర్తలకు మోదీ పిలుపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాఖీ పండుగ సందర్భంగా ముస్లింలకు చేరువ కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ముస్లింల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, వారి అభివృద్ధి కోసం చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఎన్డీయే ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేస్తూ తన ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ముస్లిం మహిళలు సంతోషిస్తున్నారని, ఈ చట్టం తమకు గట్టి భద్రతను కల్పించిందని భావిస్తున్నారని తెలిపారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఒకరు మాట్లాడుతూ, ముస్లిం మహిళల మద్దతును కూడగట్టేందుకు రక్షా బంధన్ పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని మోదీ చెప్పారని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గంతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకోవాలని చెప్పినట్లు తెలిపారు. సమాజంలోని వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మోదీ, బీజేపీ నేతలు ఈ సమావేశంలో వివరించారన్నారు. ముస్లింలలో వెనుకబడిన వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు మోదీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.