5 రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో తేదీలు ఇవే..

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల.. అంటే.. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసింది. ఏ రాష్ట్రంలో ఏ రోజు ఎన్నికలు జరిపేదీ స్పష్టమైన ప్రకటన ఇచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి.. వివరాలు ఇచ్చారు. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ గజెట్ నోటిఫికేషన్ నవంబర్ 3న రానుంది. నామినేషన్స్ స్వీకరణ నవంబర్ 10న జరగనుంది. నామినేషన్ల పరిశీలన నవంబర్ 13న జరగనుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణ నవంబర్ 15న జరగనుంది. మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఛత్తీస్‌గఢ్ నవంబర్ 7, 17న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా మధ్యప్రదేశ్ – నవంబర్ 7న, రాజస్థాన్ లో నవంబర్ 23న తెలంగాణ నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. డిసెంబర్ 5 నాటికి ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగుస్తుంది. మిజోరం ప్రభుత్వ గడువు 17 డిసెంబర్ లోపు ముగుస్తుందనీ, మిగతా నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాల గడువు 16 జనవరి 2024 నాటికి పూర్తి అవుతుందని రాజీవ్ కుమార్ తెలిపారు. ఈసారి 5 రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా.. ఐదు రాష్ట్రాల్లో 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారనీ, వారిలో 60.2 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని వివరించారు. 40 రోజులపాటూ ఈ ఐదు రాష్ట్రాల్లో పరిస్థితులను గమనించి, పార్టీలు, ప్రభుత్వ ఉద్యోగాలతో చర్చించినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. తెలంగాణలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల ఓటర్లు, ఛత్తీస్ గఢ్‌లో 2.03 కోట్ల ఓటర్లు, రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది, మిజోరంలో 8.52 లక్షల ఓటర్లు ఉన్నారని రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ప్రతి 897 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఉంటుందని రాజీవ్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.