జనాభా ఆధారంగా ఓబీసీ లకు రిజర్వేషన్లు కల్పించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జనాభా లెక్కలను కేంద్రం తేల్చాలని, జనాభా ఆధారంగానే వారికి రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని జేడీ(యూ), ఆర్జేడీ, బీఎస్పీ, డీఎంకే సమాజ్వాదీ పార్టీ లాంటి పార్టీలు ఇప్పటికే గట్టిగా డిమాండు చేస్తుండగా.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు స్వరాన్ని మరింత పెంచాయని గుర్తు చేశారు. అట్టడుగువర్గాలకు కావాల్సింది కల్లబొల్లి కబుర్లు కాదని.. ఆర్థిక, రాజకీయ అధికారమని నొక్కి చెప్పారు. ఇందుకోసం 50శాతం కోటా పరిమితి తొలగించి, జనాభా ఆధారంగా ఓబీసీ లకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. కులగణన కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాశారని, కులగణన చేయాలన్న కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మరోసారి పునరుద్ఘాటించడం హర్షణీయం అన్నారు. మిగతా విపక్ష సభ్యులతో కలిసి తన సహచరులు ఈ విషయాన్ని గతంలో పార్లమెంటు ఉభయ సభల్లో పలుమార్లు డిమాండ్ చేశారని లేఖలో ఖార్గే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కులగణన వివరాలు లేకపోతే అర్థవంతమైన సామాజిక న్యాయం, సాధికారత కార్యక్రమాలు అసంపూర్ణంగా ఉంటాయని తెలిపారు. 2021లో జనగ ణన నిర్వహించాల్సి ఉన్నా.. ఇంతవరకు ఆ పని పూర్తి కాలేదని గుర్తుచేశారు. చివరిసారిగా యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011-12 సామాజిక, ఆర్ధిక కులగణనలో 25 కోట్ల కుటుంబాలను భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. కొన్ని కారణాల వల్ల ఆ జాబితా విడుదల కాలేదని.. 2014లో అధికారం చేప ట్టిన బీజేపీ కూడా ఆ విషయాన్ని విస్మరించిందని పేర్కొన్నారు. తక్షణమే జనగణన జరిపి సమగ్ర కులగణనను అందులో అంతర్భాగం చేయాలని డిమాండ్ చేశారు.నేడిక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ  కులగణనను జేడీ(యూ) తొలి నుంచీ సమర్ధిస్తూ వస్తోందని, కులగణనకు అనుకూలంగా సీఎం నీతీశ్ కుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బిహార్ లోని భాజపా సానుకూలంగా స్పందించడం గమనార్హం అన్నారు. దేశవ్యాప్తంగా కులగణనకు పెరుగుతున్న డిమాండ్లను కేంద్రం పట్టించుకోవాలని పేర్కొన్నారు. తమిళనాడు కులగణన కోరుతుందని, బిహార్ అడుగుతోందని, కానీ భాజపా ఎందుకు పారిపోతోందని ప్రశ్నించారు. ఆరెస్సెస్ భావజాలమే ఇందుకు కారణమని విమర్శించారు. భాజపా మాతృసంస్థ ఆరెస్సెస్ తన 97 ఏళ్ల చరిత్రలో సంస్థ పగ్గాలు ఎన్నడూ దళితులకు, వెనకబడిన వర్గాలకు ఇవ్వలేదన్నారు. అలాంటి వారు కులగణన ఎందుకు చేస్తారని గుజ్జ సత్యం విమర్శించారు.కార్యక్రమంలో  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌటు పల్లి సురేశ్, గ్రేటర్   హైదరాబాద్ ఉపాధ్యక్షులు బిళ్ళ పండరినాథ్, మంగళపల్లి రమేశ్, జయరాజ్ , వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.