హైదరాబాద్ లో పెరుగుతున్న భూముల ధరలు కేవలం ట్రైలర్ మాత్రమే

.. ఐటీ మంత్రి కేటీఆర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: హైదరాబాద్‌లో పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సమష్టిగా, బ్యాలెన్సింగ్‌‎గా పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హైదరాబాద్ హైటెక్స్‎లో ఏర్పాటుచేసిన టైమ్స్ ఆఫ్ ఇండియా, టైమ్స్ మెగా ప్రాపర్టీ ఎక్స్ పో-2023ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సాగునీరు, తాగునీరు, వ్యవసాయ రంగం, పరిశ్రమలు, విద్యుత్.. ఇలా అన్ని రంగాలపై ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ముందుచూపుతో దృష్టి సారించిందన్నారు.తెలంగాణ రాకముందు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ ఉండేది, పవర్ హాలిడేస్‎తో పరిశ్రమలకు సెలవులు కూడా ఇచ్చే వాళ్లని చెప్పారు. జిరాక్స్ సెంటర్ నడవాలన్నా కరెంటు ఉండేదికాదన్నారు. కానీ, నేడు రాష్ట్రంలో 26 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉందని చెప్పారు. గతంలో తాగునీరుకు హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ ఇబ్బంది ఉండేదని, సీఎం కేసీఆర్ దార్శకనికతతో కృష్ణా, గోదావరి నదుల నుంచి వందల కిలోమీటర్లు నీళ్లు తీసుకువచ్చి నగరవాసులకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ఇటు కాళేశ్వరం, అటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 10 శాతం తాగు నీటిని అందిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌కు భవిష్యత్తులో తాగునీటి కొరత ఉండదని స్పష్టం చేశారు.హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారని, సినీ హీరో రజినీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఇది న్యూయార్కా లేక హైదరాబాదా అనే సందేహం వచ్చిందన్నారని గుర్తుచేశారు. విశ్వనగరంగా పోటీపడాలంటే మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వరకు మెట్రో టెండర్లు కూడా పూర్తయాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. నగరం చుట్టూ మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలిపారు.

 

రాజధాని నగరానికి ఏ రంగంలో పెట్టుబడులు రావాలన్నా.. శాంతి భద్రతలు చక్కగా ఉండాలన్నారు. గతంలో ఏ పండుగొచ్చినా హైదరాబాద్‌లో వారం రోజుల పాటు కర్ఫ్యూ ఉండేదని, అయితే తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి ఇప్పటివరకు రాలేదని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్‎కే పరిమితం కాలేదు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పెరిగిందని వెల్లడించారు. మెట్రో రైలును విస్తరిస్తామని, మూసీ సుందరీకరణ చేస్తామన్నారు. గొప్ప విజనరీ లీడర్ మన కేసీఆర్ ఉన్నారని, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ అంటే గచ్చిబౌలి, కొండాపూర్ అని కొంత మంది విమర్శిస్తున్నారని, న్యూయార్క్‌ లాంటి నగరాల్లో కూడా కొన్ని పాత పట్టణాలు ఉన్నాయని చెప్పారు. స్కై టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చిందని, గ్రీన్ బిల్డింగ్స్‎ని ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. డబ్బా బిల్డింగులే కాదు.. అట్రాక్టివ్‎గా కూడా నిర్మాణాలు జరగాలని సూచించారు. హైదరాబాద్ పడమరవైపే కాకుండా మిగతావైపుల కూడా బిల్డర్లు అభివృద్ధి చేయాలన్నారు. అక్కడ కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున వసతులు కల్పించిందని, సౌత్, ఈస్ట్ హైదరాబాద్‌పై బిల్డర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.